మనకు కావలసిన వారు..ఎంతో ఆత్మీయులు చాలా కాలం తర్వాత మనల్ని కలిస్తే..ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో, హీరోయిన్లు దగ్గరగా చూస్తే..వారితో మాట్లాడితో అభిమానులకు ఆనందాలకు అవధులే ఉండవు. వారితో సెల్ఫీ తీయించుకొని తమవారందరికీ ఆ ఫోటో, వీడియో చూపించి తెగ సంబర పడిపోతుంటారు. ఇక కొంత మంది అభిమానులు తమ అభిమాన హీరో సినిమాలు విడుదలైతే చాలు థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తారు..కొన్ని సార్లు ప్రమాదాలకు గురై చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ అభిమాని తనకు ఇష్టమైన హీరోని చూసి పట్టరాని ఆనందంలో అక్కడే ప్రాణాలు విడిచాడు.
వివరాల్లోకి వెళితే..తెలుగులో ‘ఈగ’ చిత్రంలో విలన్ గా నటించిన ‘సుదీప్’ అందరికీ సుపరిచితుడే..ఎందుకంటే ఈ చిత్రంలో సుదీప్ విలన్ గా అద్భుతమైన నటన ప్రదర్శించాడు. గత శుక్రవారం కన్నడంలో సుదీప్ నటించిన ‘హెబ్బులి’ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం పాజిటీవ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ విజయయాత్ర ప్రారంభోత్సవం కోసం సోమవారం తుమకూరు పట్టణంలోని గాయత్రి థియేటర్కు వచ్చాడు. సుదీప్ను చూడటానికి భారీఎత్తున అభిమానులు తరలివచ్చారు.
హోటల్ కార్మికుడైన శశిధర్(45)కు సుదీప్ అంటే వీరాభిమానం.ఇక ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. తన అభిమాన హీరోను చూడడమే కాదు.. మనసారా ఆలింగనం చేసుకున్నాడు. ఎంతో ఉప్పొంగిపోయాడు. ఆ ఆనందాన్ని ఆ గుండె తట్టుకోలేకపోయింది... ఆ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి కావడం..పడిపోవడం జరిగింది. సుదీప్ అభిమానులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. స్థానిక వైద్యుల సూచనతో బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో సుదీప్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.