తెలుగు ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రవితేజ ‘ఇడియట్’ చిత్రంతో హీరోగా మారారు. ఈ చిత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చింది. అప్పటి నుంచి వీరి మద్య మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో తనదైన స్టైల్ తో మాస్ లుక్స్ తో అందరినీ ఆకర్షించిన రవితేజ తర్వాత మాస్ మహరాజు గా పిలవబడ్డారు. అయితే రవితేజ సోదరులు రఘు, భరత్ ( ఈ మద్య ప్రమాదంలో మరణించారు) లు కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
అప్పట్లో వీరిద్దరూ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ విషయం తెలిసిందే. అప్పటి నుంచి భరత్ తో పెద్దగా సంబంధాలు కొనసాగడం లేదని ఆ మద్య రవితేజ అన్నారు. తాజాగా హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా పట్టడినప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపణలు మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే కొంత మంది సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేసింది. కాగా పూరి జగన్నాథ్, సుబ్బరాజు,తరుణ్, నవదీప్, కెమెరామాన్ శ్యామ్ కే.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, నటి చార్మి లు హాజరు కాగా..నిన్న ముమైత్ ఖాన్ హాజరయ్యారు.
అయితే వీరందరూ పూరి బ్యాచ్ అని సోషల్ మీడియాలో ప్రచారాలు వస్తున్న నేపథ్యంలో నేడు సిట్ ముందు మాస్ హీరో రవితేజ హాజరయ్యారు. ఇక రవితేజ సిట్ ముందు హాజరుకానున్న నేపథ్యంలో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు నిప్పులాంటి వాడని..గతంలో తన తమ్ముళ్లుపై వచ్చిన ఆరోపణలకే చాలా కుంగి పోయాడని అలాంటి చెడు వ్యసనాలకు చాలా దూరంగా ఉంటారని అన్నారు. సినిమా కెరీర్ లో ఎవ్వరి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన రవితేజ తన కెరీర్ గురించే ఆలోచిస్తారని ఇలాంటి చెడు వ్యసనాలకు అస్సలు దరి చేరనివ్వరని అంటున్నారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి.
ఒకవేళ ఎవరైనా గిట్టని వారు తన కొడుకుపై కుట్ర పన్నితే తప్ప ఎవ్వరూ డ్రగ్స్ తీసుకున్నారని నిరూపించలేరని ధీమా వ్యక్తం చేశారు. రవితేజ సమాధానం చెబుతాడని, సిట్ అధికారులు కోరితే పరీక్షల కోసం రక్తనమూనా ఇచ్చేందుకు కూడా సిద్ధమని రాజ్యలక్ష్మి అన్నారు. ఏ అలవాట్లు లేని తన కుమారుడి పట్ల తమకు భయం ఎందుకని ఆమె ప్రశ్నించారు.