తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి అనూహ్యంగా హీరోగా మారారు కమెడియన్ సునీల్. ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఒకటీ, రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించినా.. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేక పోయాయి. ఆ మద్య వచ్చిన ‘జక్కన్న’ కాస్త బెటర్ అనిపించినా మూడు సంవత్సరాల నుంచి సునీల్ కి ఏ సినిమా కలిసి రావడం లేదు.
ఇక లాభం లేదనుకోని తన కామెడీనే నమ్ముకున్న సునీల్ ‘ఉంగరాల రాంబాబు’ చిత్రంతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా పై మొదటి నుంచి ఎన్నో అంచనాలు వేసుకున్న సునీల్ డివైడ్ టాక్ రావడంతో నిరాశలో పడ్డారు. సినిమా ప్రమోషన్ కోసం సునీల్ బిగ్ బాస్ లో కూడా సందడి చేశారు.
కామెడీ బేస్ అయినా సినిమాలో రైతు పోరాటం గురించి చూపించారు. జాతకాలు నమ్ముకున్న సునీల్ ఈ సినిమాలో కామెడీ పరంగా బాగానే ఆకట్టుకున్నాడు. సునీల్ సరసన మియా జార్జ్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీంతో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భారీ అంచనాలే పెట్టుకున్నాయి. అంతే కాదు నిన్న ఈ సినిమాతో పాటు ‘కథలో రాజకుమారి’, ‘వీడెవడు’, ‘శ్రీవల్లి’, డబ్బింగ్ సినిమా ‘సరసుడు’ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ వచ్చాయి. సినిమాలో అంతగా ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవడంతో ఉంగరాల రాంబాబు సునీల్ ని నిరాశపరిచింది.