గత కొంత కాలంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింక కేసులో పలు మార్లు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. కృష్ణజింక కేసులో విచారణకు హాజరయ్యేందుకు జోద్పూర్ కోర్టుకి వెళ్ళిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను లారెన్స్ విష్ణోయ్ అనే గ్యాంగ్స్టర్ బెదిరించారు. బిష్ణోయ్ కులస్తులు కృష్ణ జింకలను దైవంగా ఆరాధిస్తారు. అయితే తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రేస్ 3 షూటింగ్ పరిసర ప్రాంతాలలో సంచరించడం చిత్ర యూనిట్ గుర్తించినట్టు సమాచారం.
దీంతో యూనిట్ వెంటనే పోలీసులకి సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకొని సల్మాన్ని, చిత్ర నిర్మాత రమేష్ తౌరానిని ఎస్కార్ట్ వాహనంలో సల్మాన్ ఇంటికి తరలించారు. త్వరలో జరగనున్న షెడ్యూల్ కోసం సల్మాన్కి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని పోలీసులు అంటున్నారట. అంతే కాదు ఆరుగురు పోలీసుల రక్షణలో సల్మాన్ తన వాహనంలో ఇంటికి చేరుకున్నట్టు ఆ పత్రిక కథనం ఇచ్చింది.
కాగా, ఈ విషయమై ముంబై పోలీసులు మాట్లాడుతూ, సల్మాన్ కు బెదిరింపులు రావడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నామని చెప్పారు.‘రేస్ 3’ సెట్స్ వద్ద మరింత భద్రత కల్పిస్తున్నట్టు చెప్పారు. రేస్ 3 చిత్రంలో సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికగా నటించనుండగా, అనీల్ కపూర్, డైసీ షా, బాబీ డియోల్, సాఖీబ్ సలీమ్ , ఫ్రీడీ దరువాలాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు .
ఈ ఏడాది ఈద్ కానుకగా మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రేస్ 3 చిత్రం గుర్గావ్ లోని ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్నట్టు సమాచారం.రెమో డిసౌజా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.