భారత దేశంలో గత కొన్ని రోజులుగా 'పద్మావతి' చిత్రంపై వివాదాలు కొనసాగుతున్నాయి. రాజ్ పూత్ లకు సంబంధించిన చరిత్రను ఈ చిత్రంలో వక్రీకరించారని.. పద్మావతి పై కల్పిత కథనం సృష్టించారని కర్ణిసేన, రాజ్ పూత్ లు ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే అన్ని అడ్డంకులు తొలగించుకొని సినిమా టైటిల్ ని మార్చి ‘పద్మావత్’ ఈ రోజు విడుదల అయ్యింది. కొన్ని చోట్ల ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనివ్వకపోగా.. విడుదలైన అన్ని థియేటర్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.
దీంతో చాలా ప్రాంతాలలో పద్మావత్ ప్రశాంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే మరొకొన్ని చోట్ల మాత్రం ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు వాహనాలపై రాళ్లు రువ్వుతూ, తగలబెడుతున్నారు. ఈ చిత్రంలో `ఘూమర్` పేరుతో విడుదల చేసిన ఈ పాటను రాజస్థాన్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది.
తాజాగా ఈ పాటపై మరో వివాదం తెరపైకి వచ్చింది. రాజ్ పుత్ కర్ణిసేన చేస్తున్న నిరసనల ఫలితమో లేక వివాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఆందోళనో... ఉదయ్ పూర్ పాఠశాలలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో రాజస్థాన్ సంప్రదాయ నృత్యమైన 'ఘూమర్'ను ప్రదర్శించ వద్దన్న ఆదేశాలు వెలువడ్డాయి.
ఉదయ్ పూర్ అదనపు కలెక్టర్ ఎస్ సీ శర్మ పేరిట ఈ ఆదేశాలు వెలువడ్డాయి. 'పద్మావత్' చిత్రంలో 'ఘూమర్ ఘూమర్' పాటకు దీపికా పదుకొనే నృత్యం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.