తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది..ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణం జీర్ణించుకోక ముందు తెలుగు సీనియర్ నటులు వంకాయల సత్యనారాయణ మృతి చెందారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. సత్యనారాయణ వయసు 78 సంవత్సరాలు.
వంకాయల సత్యనారాయణ డిసెంబర్ 28, 1940లొ విశాఖపట్నంలో జన్మించారు. ఆయన కొంతకాలంగా విశాఖలోని కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. వంకాయల సత్యనారాయణ కెరీర్లో దాదాపు 180పైగా సినిమాలు, పలు టీవీ సీరియల్స్లో నటించారు. సినిమాల్లోకి రాక ముందు ఆయన చదువు, స్పోర్ట్స్లో మంచి ప్రతిభ కనబరిచేవారు. బికాంలో గోల్డ్ మెడల్ అందున్నారు.
1960 ఆగస్టులో షూటింగ్ కాంపిటీషన్లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు. హిందుస్థాన్ షిప్యార్డులో మంచి ఉద్యోగం వచ్చినప్పటికీ ఉద్యోగం కన్నా నటనరంగమే ముఖ్యమని భావించినా సత్యనారాయణ సినిమాల వైపు అడుగులు వేశారు.
సత్యనారాయణ ‘నీడలేని ఆడది’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. సీతామాలక్ష్మీ, శ్రీనివాస కల్యాణం, శుభలేఖ, దొంగ కోళ్లు, ఊరికి ఇచ్చినమాట, విజేత వంటి చిత్రాలతోపాటు సుమారు 150కిపైగా చిత్రాల్లో నటించారు. కాగా వంకాయల సత్యనారాయణమూర్తి మృతి పట్ల పలువురు నటులు సంతాపం తెలిపారు.