తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ మూవీలు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రం రాబోతుంది. సావిత్రి పాత్రలో మళియాళ భామ కీర్తి సురేష్ నటిస్తుంది. ఇతర పాత్రలో సమంత, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు..చిత్రానికి సంబంధించిన ముహూర్తం కూడా ఇటీవల జరుపుకుంది.
ఇక రాజీకీయ నేపథ్యంలో మొదటి సారిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ లోగా రిలీజ్ చేశారు. తాజాగా వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు ప్రముఖ నటుడు మమ్ముట్టి. తన ఫేస్బుక్ పేజీలో మమ్ముట్టీ ఈ మేరకు ఒక పోస్టు పెట్టారు. తాజాగా సినిమాలో వైఎస్ గెటప్ లో మమ్ముట్టి కనిపించే వైనాన్ని ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు.
అచ్చం వైఎస్ ను గుర్తు చేసేలా మమ్ముట్టి లుక్ ఉందని వారు కామెంట్ల రూపంలో ప్రశంసిస్తున్నారు. పంచెకట్టులో, వైఎస్ స్టైల్లో మమ్ము ఆకట్టుకుంటున్నారని కామెంట్లను పోస్టు చేస్తున్నారు. యాత్ర ఫస్ట్ లుక్ చూసి వైఎస్ అభిమానులు ఆనందోత్సాహంలో మునిగిపోయారు. మహీ వీ రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది. విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశిలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.