అన్నపూర్ణ సినీ స్టూడియోస్ లో ఈ రోజు ఉదయం ప్రారంభమైన సినీ పెద్దల సమావేశం కొంచెం సేపటి క్రితం ముగిసింది. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సమావేశం సుమారు రెండున్నర గంటలకు పైగా కొనసాగింది. క్యాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలపై చర్చించే నిమిత్తం 24 క్రాఫ్ట్స్ కు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో చర్చించారు. కాగా ఈ మీటింగ్ కి పవన్ కళ్యాన్ వస్తారని అందరూ భావించారు..కానీ చివరి నిముషానికి ఆయన మీటింగ్ కి హాజరు కాలేదు.
ముందు చెప్పినప్పటికీ, భద్రతా కారణాల రీత్యా ఆయన హాజరు కాలేదు. 24 క్రాఫ్ట్స్ కు చెందిన ప్రతినిధులతో పవన్ సమావేశం అవుతారని, ఈ సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనేది త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం.అయితే, సమావేశానంతరం, మీడియాతో మాట్లాడకుండానే సినీ పరిశ్రమ పెద్దలు వెళ్లిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే..సినీ ప్రముఖులంతా హాజరై తాజా పరిణామాలపై చర్చించారు. అయితే ఈ మీటింగ్కు వెళ్లిన కత్తి మహేష్కు పవన్ అభిమానుల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమైంది. జై పవర్ స్టార్ నినాదాలతో పవన్ ఫ్యాన్స్ మహేష్ను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన తన ఫేస్ బుక్ లో ఇలా స్పందించారు. ‘‘నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడదాం అని వెళ్లాను. సంఘీభావం వ్యక్తపరచడానికి వెళ్లాను. తల్లి ఎవరికైనా తల్లే అనే నినాదంతో ముందుకెళ్లండి. పరిశ్రమ కోసం పాటుపడండి. అనవసరపు రాజకీయం చెయ్యకండి. అని చెప్పడానికి వెళ్లాను. ఫ్యాన్స్ నాపై దాడికి ప్రయత్నం చేశారు. థ్యాంక్యూ పవన్ కల్యాణ్ అని కత్తి ట్వీట్లో పేర్కొన్నారు.