ఆంధ్రప్రదేశ్ లో ప్రజల సమస్యలపై అవగాహన 2పెంచుకోవడానికి..వారి సమస్యలపై ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల గురించి ప్రజలకు తెలియజెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చరిత్రాత్మకమని హీరో మంచు విష్ణు వర్ధన్ అభిప్రాయడ్డారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఓట్లు అడగడానికి మాత్రమే ఇంటింటికీ తిరుగుతారు. ఆ సమయాల్లోనే వారు హడావుడిగా తిరుగుతూ తెగ హల్ చల్ చేస్తుంటారు.
కానీ వైఎస్ జగన్ పరిస్థితి వేరు అని..తన స్వార్థం కోసం కాకుండా ఎండా, వానా అనకుండా పాదయాత్ర చేస్తున్నారని ఆయన ప్రజానాయకుడు అయ్యాడు అని అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. సాధారణంగా ఎవరైనా ఐదు, పది కిలో మీటర్లు ప్రయాణిస్తే..అమ్మా..అయ్యా అంటారు..నా వరకు నేను ఐదు కిలో మీటర్లు పరిగెడితే అలసి పోతాను.
జగన్ మోహన్ రెడ్డి ఏకంగా రెండు వేల కిలో మీటర్లు పయాణం చేయడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. శుక్రవారం తణుకులోని స్ప్రింగ్ బోర్డు పాఠశాలలో మంచు విష్ణు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సి ఉందని, విద్యార్థికి ర్యాంకులు, మార్కులే ప్రామాణికం కాదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చిన్న నాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుంటే..ఏ విషయంలోనైనా విజయాలు సాధించవొచ్చని అన్నారు. కాగా, మంచు విష్ణు తర్వాతి చిత్రం ‘ఓటర్’ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత రాజకీయాలను ప్రతిబింబించేలా తెరకెక్కనుంది.