సావిత్రి జీవితంలోని వెలుగు నీడలు నటుడు పాత్రికేయులు - రావి కొండలరావు గారి మాటల్లో (వాట్స్-ఆప్ లో ట్రెండింగ్ అవుతుంది -ఏపి హెరాల్డ్ పాఠకుల కోసం)  మహానటిలో చూపిన సావిత్రి జీవితానికి యదార్ధంగా సావిత్రి జీవితానికి మధ్యగల తేడాను ప్రముఖ నటులు శ్రీ రావికొండల రావు గారు విశ్లేషించారు. అది మీ కోసం, హద్దు దాటితే నన్ను మన్నించండి! 

Related image

''మహానటి'' సినిమాకు ప్రజలు బాగా కనెక్ట్‌ అవడంతో మంచి కమ్మర్షియల్‌ సక్సెసయింది. దానిలో దొర్లిన తప్పులు కొందరు ఎత్తి చూపుతున్నారు. సావిత్రి కి జెమినీ గణేశన్ తాగుడు అలవాటు చేశాడనడానికి ఆధారం ఏమిటని? ఆయన పెద్ద భార్య కూతురు డా. కమలా సెల్వరాజ్‌ అడిగారు.


వెంకట్రామయ్య చౌదరే అలవాటు చేశారని రమాప్రభ అంటున్నారు. దాన్ని బయోపిక్‌ అనకుండా సావిత్రి జీవితంపై ఆధారపడిన సినిమా అని ఉంటే  (''డర్టీ పిక్చర్‌'' సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా తీశాం అని చెప్పుకున్నట్లు)  గొడవ వుండేది కాదు.

Related image

చాలా భాగం వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు కలపడంతో గొడవ వచ్చిపడింది. నాటకీయత కోసం, ముఖ్యపాత్ర (ప్రొటగానిస్టు) పై  ప్రేక్షకుడికి సింపతీ పోకుండా ఉండడం కోసం కొన్ని పొయెటిక్‌ లిబర్టీస్‌ తీసుకోక తప్పదు. కానీ సావిత్రి కుమార్తె, విజయ చాముండేశ్వరి దీనిలో వాస్తవాలే చూపించారు అని సర్టిఫై చేయడంతో చిక్కు వచ్చింది. చిన్నచిన్న డిటెయిల్స్‌ లో వచ్చిన తప్పుల గురించి నేనిక్కడ రాయటంలేదు. జెమిని గణేశన్‌తో బంధం గురించి సినిమాలో చూపిన తీరు గురించే నేను రాస్తున్నాను.


నిజానికి సావిత్రి జీవితాన్ని యథాతథంగా తీస్తే ప్రేక్షకుల్లో సానుభూతి కలగడం కష్టం. కేవలం ఆమె బాల్యం, నట జీవితం గురించి మాత్రం తీస్తే డ్రామా ఉండదు. ఆమె తెర మీద జీవితంలో ఎంత డ్రామా ఉందో? తెర అంతే?  డ్రామా ఉంది. తనెన్నో తప్పులు చేశానని ఆమే స్వయంగా చెప్పుకునేది. అయినా ఆమె ఆంధ్రుల అభి మాన నటి కాబట్టి అవన్నీ చూపలేరు. చూపిస్తే జనాలకు నచ్చదు. అలా అని జెమినీ తో గొడవ చూపకుండా మానలేరు. అతన్ని పూర్తిగా విలన్‌ చేయలేరు, అదే సమయంలో అతనిలో కొన్ని లోపాలు చూపాలి. వాటి వలన మన హీరోయిన్‌ బాధపడి, దేవదాసు టైపులో తాగుడుకి బానిసై, ఆరోగ్యం చెడగొట్టుకుని మరణించిందని చూపదలచారు.

Related image

జెమినీ పాత్ర వేసిన తను కూడా హీరోయే కాబట్టి ఆ లోపాలకు కూడా జస్టిఫికేషన్‌ చూపించాలి. అందువలన అతను తనకంటె ప్రతిభావంతురాలైన భార్యను చూసి అసూయపడి, తనకు వేషాలు రాక, ఆత్మన్యూనతా భావంతో అలమటించి, దాన్ని పోగొట్టుకోవడానికి కాబోలు ఎవరో అమ్మాయితో శయనిస్తే, దాన్ని కళ్లారా చూసిన హీరోయిన్‌ తట్టుకోలేక తన జీవితాన్ని ఆత్మహత్యా సదృశమైన బాట పట్టించిందని, ఆ ఆవేదనలోనే పిల్లలను సరిగ్గా పట్టించుకోలేక పోయిందని చూపించారు. ఈ కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానిలో వాస్తవాల గోల వాళ్లకు అక్కరలేదు. అయ్యో పాపం!  సావిత్రి అనుకున్నారు, చాలు, సినిమా ఆడేస్తోంది.


ఈ సినిమా హిట్‌ కావడంతో యీ కల్పనే  కొన్నాళ్లకు నిజమై కూర్చుంటుంది. ''మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి'' పేరుతో పల్లవి అనే ఆమె ఒక జీవిత చరిత్ర రాశారు. దానిలో హాలీవుడ్‌ నటీ మణి, సావిత్రి కంటె 17ఏళ్లు పెద్దదైన సూసన్‌ హేవర్డ్‌ సావిత్రి సినిమాలు చూసి, ఆమెకు అభిమాని అయినట్లు, సావిత్రిని అభినందిస్తూ ఒక ఉత్తరం రాసినట్లు కల్పించారు. నిజానికి సూసన్‌ హేవర్డ్‌, సావిత్రి అభిమాన నటి. ఆమె సావిత్రి సినిమాలు చూసే అవకాశమే లేదు. చూసినా ఉత్తరం రాసిన దాఖలాలు లేవు. ఇది కల్పించిన రచయిత్రి, యిది కల్పన అని ఎక్కడా రాయలేదు.


అసలా పుస్తకం పూర్తి వాస్తవాలతో కూడిన జీవిత చరిత్రో? లేక చిక్కనైన కథనం కోసం కల్పన రంగరించిన రచనో? ఎక్కడా తెలుపలేదు. కొన్నేళ్లు పోయిన తర్వాత దాని లో రాసినవన్నీ అక్షరసత్యాలని ప్రజలు భ్రమించే ప్రమాదం ఉంది. అలాగే ''మహానటి'' సినిమా చూసిన భావితరాల వారు సావిత్రికి వచ్చిన పేరు చూసి జెమినీ అసూయపడ్డాడని నమ్మవచ్చు. భావితరాల మాట ఎలా వున్నా, యీ తరంలోని, వారు కూడా, పూర్తి వివరాల జోలికి వెళ్లకపోతే అలా అనుకునే ప్రమాదం ఉంది. అందు కని ఆ వివరాలు సేకరించి యిస్తున్నాను.

Image result for dulquer salmaan gemini

జెమినీ గణేశన్‌ 1920 లో పుట్టాడు. సావిత్రి కంటె 15 ఏళ్లు పెద్దవాడు. తండ్రి  చిన్నప్పుడే పోతే మద్రాసులో మేనత్త 'ముత్తు లక్ష్మీ రెడ్డి' వద్ద చేరాడు. ఆవిడ డాక్టరీ చదివి దేవదాసీ వ్యవస్థను రూపుమాపడానికి సామాజిక ఉద్యమం నడిపేది. కొంతకాలం ఆవిడ వద్ద చదువుకుని, తర్వాత తల్లి వద్దకు పుదుక్కోటై కు వచ్చి. ఆ తర్వాత మద్రాసులో సైన్సు గ్రాజువేట్‌ అయ్యాడు. 1940 లో పెళ్లయింది. డాక్టరీ చదివిస్తా నన్న మావగారు పెళ్లయిన ఆర్నెల్లకే చనిపోవడంతో మద్రాసులో కెమిస్ట్రీ లెక్చరరు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. 1947 లో జెమినీ స్టూడియోలో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. ''మిస్‌ మాలిని'' (1947)లో పుష్పవల్లి పక్కన హీరోగా పరిచయ మయ్యాడు. అది ఆడలేదు. అక్కడ ఉండగానే  'సావిత్రి టాలెంటు'  గుర్తు పట్టి సిఫార్సు చేయడం జరిగింది.


ద్విపాత్రాభినయం చేసిన ''మనం పోల్‌ మాంగల్యం'' (1953) తోనే స్టార్‌ డమ్‌ వచ్చింది. దానిలో అతని పక్కన సావిత్రి హీరోయిన్‌. ఆ సినిమా షూటింగు సమయం లోనే 1952 లో వాళ్లిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటికి సావిత్రికి 17ఏళ్లయితే జెమినీకి 32. ఏమీ తెలియని పల్లెటూరి అమ్మాయిలా వున్న, సావిత్రికి అతను హై-ఫై-లైఫ్‌ పరిచయం చేశాడనీ, అనేక కొత్త విషయాలు నేర్పాడని, అభిరుచులు మప్పాడని సినిమాలో కూడా చూపారు. చిన్నతనంలోనే చనిపోయిన తండ్రి పట్ల అబ్సెషన్‌ ఉన్న సావిత్రి అతనిలో తన తండ్రిని చూసుకుందని సటిల్‌గా ఎస్టాబ్లిష్‌ చేశారు కూడా.


పెళ్లయ్యాక యిద్దరి దశ తిరిగింది. కలిసి వేసిన సినిమాలూ, విడివిడిగా వేరే వాళ్లతో వేసిన సినిమాలూ కూడా హిట్టయ్యాయి. సావిత్రి ఎంత పెద్ద హీరోయిన్‌ అయిందో తెలుగు వాళ్లందరికీ తెలుసు. సినిమాలో కూడా చూపించారు.

Image result for gemini ganesan & girl friends

అయితే జెమినీ గణేశన్‌ ఏ పాటి హీరో, అతని మార్కెట్‌ ఎలా ఉండేది? ఎంత వరకు ఉంది? అనేది మన తెలుగు వాళ్లల్లో చాలామందికి తెలియదు. అతను సావిత్రి డబ్బు పై పడి తిన్న పరాన్న భుక్కు అని కూడా కొందరు అనుకుంటారు. అందువలన అతని కెరియర్‌ గురించి కాస్త రాస్తాను. తమిళంలో శివాజీ, ఎమ్జీయార్‌ టాప్‌ స్టార్స్‌. వాళ్లతో పాటే యితర హీరోలు కూడా ఉండేవారు. మన దగ్గర జగ్గయ్య, కాంతారావు, హరనాథ్‌ ఉన్నట్లు! వీళ్లు స్వతంత్రంగా హీరోలుగా వేస్తూనే ఎయన్నార్‌, ఎన్టీయార్‌ లతో బాటు పారలల్‌ హీరో గా వేసేవారు. అటువంటి పారలల్‌ హీరో పాత్రల్లో జెమినీ చక్కగా ఒదిగేవాడు.


జెమినీ ఎమ్జీయార్‌తో ఒక్క సినిమాయే వేసినా, శివాజీతో చాలా వేశాడు. విడిగా, హీరోగా అతనికి చాలా డిమాండ్‌ ఉండేది. విజయా వారు తీసిన మిస్సమ్మ, గుణసుందరి, మాయాబజార్‌, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మ కథ తమిళ వెర్షన్లలో అతనే హీరో. ముక్తా శ్రీనివాసన్‌, శ్రీధర్‌ వంటి దర్శక నిర్మాతలు, బాలచందర్‌ వంటి దర్శకులు - అందరూ జెమినీని యిష్టపడేవారు. అతనికి దర్శకుడితో కాని, సహనటుడితో కాని ఎప్పుడూ పేచీలు రాలేదు.


జానపద, చారిత్రాత్మక, పౌరాణిక, సాంఘిక సినిమాలన్నిటిలోను నటించాడు. ఎక్కువగా ప్రేమకథా చిత్రాలలో నటించడం వలన 'కాదల్‌ మన్నన్‌' (ప్రేమకు రాజు) అనే బిరుదు వచ్చింది. ఎప్పుడూ బిజీగానే ఉన్నాడు. వేషాల కోసం వెతుక్కోవలసిన పని ఎన్నడూ లేదు.


ఇక సినిమాల్లో చూపించిన పీరియడ్‌ గురించి ఫోకస్‌ చేసి చూస్తే సినిమాలో చూపించిన దేమిటంటే - కొద్దికాలం పోయాక చూస్తే సావిత్రి బాగా డిమాండ్‌లో ఉంది, కానీ జెమినీకి మార్కెట్‌ పోయింది. అంతా సావిత్రి గురించే అడుగుతున్నారు, అతని గురించి అడిగేవారే లేరు. దాంతో అతని అహం దెబ్బతింది. ఈ స్టోరీ లైన్‌ అమితాబ్‌, జయ నటించిన ''అభిమాన్‌'' సినిమా నుంచి తీసుకున్నారు.  ఆ సినిమాలో అమితాబ్‌ పేరున్న గాయకుడు, పల్లెటూరిలో అజ్ఞాతంగా ఉంటున్న ప్రతిభావంతు రాలైన ఒక గాయనిని చూసి, ముచ్చటపడి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను బలవంతపెట్టి స్టేజి ఎక్కించాడు. తీరాచూస్తే ఆమెకు అతని కంటె ఎక్కువ పేరు వచ్చింది. ఆమె మార్కెట్‌ ముందు యితనిది వెల తెల పోయింది. ఇతను అసూయపడ్డాడు, వాళ్ల కాపురం చెడిపోయింది. దాన్ని ''మహానటి''లో ఎడాప్ట్‌ చేసుకున్నట్లుంది. అయితే వాస్తవా లు ఎలా ఉన్నాయంటే ''సుమంగళి'' (1965) నాటికే సావిత్రి తెరపై లావుగా కనబడింది. అప్పుడామెకు 30 ఏళ్లు.


1965 తర్వాత ఆమె సోలో హీరోయిన్‌గా వచ్చిన సినిమాలు ''మనసే మందిరం'' (1966), ''నవరాత్రి'' (1966) ''ప్రాణమిత్రులు'' (1967) మాత్రమే. ''నిర్దోషి'' (1967)లో అంజలి తో, ''కంచుకోట'' (1967)లో దేవికతో, ''తల్లిప్రేమ'' (1967)లో కాంచనతో కలిసి వేయాల్సి వచ్చింది. ''ఉమ్మడి కుటుంబం'' (1967)లో ఆమె ఎన్టీయార్‌ కు వదిన. ''వరకట్నం'' (1969), ''కోడలు దిద్దిన కాపురం'' (1970)లో కూడా వదినే. కళ్లతో, మొహంతో ఎంత అభినయం ప్రదర్శించినా సరిపోదని, సాటి తారా మణులు శరీరాకృతి కాపాడు కుంటున్నారు కాబట్టి, యిక తనకు హీరోయిన్‌గా వేషాలు రావని గ్రహించడం  బట్టే ఆమె ''చిన్నారి పాపలు'' (1968) సినిమాను స్వీయ దర్శకత్వంలో 1967 అక్టోబరు లో ప్రారంభించింది. అంతకు ముందు ''నవరాత్రి'' తెలుగు వెర్షన్‌ ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ వారితో కలిసి నిర్మించింది. దీనిలో తక్కిన వాళ్లందరూ తప్పుకోవడంతో మొత్తం నిర్మాణ వ్యయం తనే భరించవలసి వచ్చింది.


ఈ టైములో జెమినీ కెరియర్‌ ఎలా ఉందో చూదాం. 1966 లో అతను వేసిన సినిమాలు (7), 67లో (8), 68 లో (5), 69 లో (11), 70 లో (9),  71 లో (12), 72 లో (10), 73 లో (7), 74 లో (5) ......అలా 1980 వరకు అంటే అతనికి 60 ఏళ్లు వచ్చే వరకు అతని సినిమా రిలీజు కాని సంవత్సరం లేదు. ఈ సినిమాల్లో అతను వేసినవి? గెష్ట్ రోల్స్ ఏమో? అనే అనుమానం రావచ్చు. అందు వలన వాటి హిందీ, తెలుగు వెర్షన్లు ఉన్న చోట తెలుగులో ఎవరు వేశారో?  రాస్తాను.


''రాము'' (తమిళ వెర్షన్‌ 1966) లో ఎన్టీయార్‌, ''ఆస్తులు అంతస్తులు'' (త.వె.1968) లో కృష్ణ, ''కలక్టర్‌ జానకి'' (త.వె.1969) లో జగ్గయ్య, ''బొమ్మా బొరుసా'' (త.వె 1969) లో రామకృష్ణ, ''మమతా'' (త.వె 1970) లో అశోక్‌ కుమార్‌, ''స్త్రీగౌరవం'' (త.వె 1971) లో కృష్ణంరాజు, ''సత్యకామ్‌'' (త.వె 1971)లో ధర్మేంద్ర, ''బడిపంతులు'' (త.వె 1973)లో ఎన్టీయార్‌, ''ఓ మై నహీ'' (త.వె 1974) లో నవీన్‌ నిశ్చల్‌, ''నమక్‌ హరామ్‌'' (త.వె 1975) లో అమితాబ్‌ బచ్చన్‌, ''కోరా కాగజ్‌'' (త.వె 1976)లో విజయ్‌ ఆనంద్‌..యిలా! ఈ లోగా 1971లో అతనికి పద్మశ్రీ వచ్చింది. (శివాజీ గణేశన్‌కు1966లో వచ్చింది. ఎమ్జీయార్‌కు యివ్వబోతే వద్దన్నాడని వినికిడి. చనిపోయాక భారతరత్నయిచ్చారు). పరిస్థితి యిలా వుండగా అతనికి డిప్రెషన్‌ వచ్చే అగత్యమేముంది?


ఇక ఆంధ్రలో గజారోహణ టైము లో అతన్ని ఎవరూ పట్టించుకోనట్లు, అవమానం జరిగినట్లు సినిమాలో చూపించారు. గజారోహణం టైము లో సావిత్రి హుషారుగా ఉంటే, జెమినీ బెదిరి, ఎందుకివన్నీ అన్నాడనీ కొందరు రాశారు. రేలంగి కూడా గజారోహణంటే యిబ్బంది పడ్డారని రాశారు. అంత మాత్రం చేత జెమినీని జనం పట్టించు కోలేదని చూపడం మెలో డ్రామాకు పరాకాష్ట. అప్పట్లో తెలుగు ప్రాంతాల్లో ఔట్‌-డోర్‌ షూటింగులుండేవి కావు, టీవీలు ఎలాగూ లేవు. సినిమా తారలు నిజజీవితంలో ఎలా ఉన్నారో?  చూడాలంటే శతదినోత్సవ సభల్లో మాత్రమే సాధ్యం. అందువలన జూనియర్‌ ఆర్టిస్టు వచ్చినా జనాలు ఎగబడేవారు. సావిత్రికి తెలుగు నాట ఉన్న పాప్యులారిటీ జెమినీ గణేశ్‌కు లేదన్నది నూటికి నూరుపాళ్లు వాస్తవం. కానీ జెమినీ అనామకుడేమీ కాదు. డబ్బింగు సినిమాల ద్వారా తెలుగువారికి పరిచితుడు.


1962లో జరిగిన గజారోహణం నాటి సంగతిని లెక్క లోకి తీసుకుంటే ''పతియే ప్రత్యక్షదైవం'' (1955- కణవన్‌యే కణ్‌కండ దైవం, హీరోయిన్‌ అంజలి) ''విజయకోట వీరుడు'' (వంజికోట్టయ్‌ వాలిబన్‌ - 1958 వైజయంతిమాల, పద్మిని హీరోయిన్లు), ''వీరపాండ్య కట్టబ్రహ్మన్న'' (1959 - పద్మిని సరసన) ''వీరసామ్రాజ్యం'' (పార్థిబన్‌ కణవుకు తెలుగు వెర్షన్‌, హీరోయిన్‌ వైజయంతిమాల) ''మా ఊరి అమ్మాయి'' (1960 కళక్తూరు కణ్నమ్మ, హీరోయిన్‌ సావిత్రి) ''పాపపరిహారం'' (పావమన్నిప్పు - సావిత్రి సరసన) (1961), ''మురిపించే మువ్వలు'' (కొంజుం సెలంగై, హీరోయిన్‌ సావిత్రి) (1962), వంటి విజయవంతమైన డబ్బింగు సినిమాల ద్వారా జెమినీ కూడా పాప్యులర్‌ హీరోనే. పైగా మన అభిమాన నటి సావిత్రి మొగుడు. అందువలన ప్రజలు అతని వెంటపడకుండా ఎలా ఉంటారు?


ఇక పేపర్లలో 'వేషాలు తగ్గిన సాంబారు గణేశన్‌' అని వచ్చిందన్నది హాస్యాస్పదం. అప్పట్లో పత్రికలు చాలా హుందాగా ఉండేవి. ఏ ''హిందూనేషన్‌'' ''కాగడా'' వంటి వివాదాస్పద పత్రికలు అతన్ని సాంబారు గణేశన్‌ అన్నాయేమో?  కానీ మామూలుగా అయితే అలా అనడానికే లేదు. వాస్తవానికి వేషాలు తగ్గినది సావిత్రికి. అందుకే ఖాళీగా ఉండలేక దర్శకత్వం మొదలుపెట్టింది. ''మాతృదేవత'' హిట్టయినా, యితరులు ఎవరూ దర్శకత్వానికి ఛాన్సివ్వకపోవడం చేత తన డబ్బుతోనే సినిమాలు తీసుకోవలసి వచ్చింది., మొదటి రెండూ తప్పిస్తే తక్కిన మూడూ రీమేక్‌లే.


''చిరంజీవి'' (1969)  'నీర్‌కుమళి' కి రీమేక్‌. ''వింతసంసారం'' (1971) 'వియత్నాం వీడు' కు రీమేక్‌. ''ప్రాప్తం'' (1971) 'మూగమనసులు' కి తమిళ రీమేక్‌. వీటి ఒరిజినల్స్‌ బాగా ఆడాయి కానీ సావిత్రి తీసిన రీమేక్స్‌ ఫెయిలయ్యాయి. అందుకే ఆమె హితైషులందరూ సినీనిర్మాణం జోలికి, దర్శకత్వం జోలికి పోకుండా హాయిగా వచ్చిన వేషాలు వేసుకుంటూ ఉండమని సలహా యిచ్చారు. ఆమె వినలేదు. అదే ఆమె ఆర్థిక యిబ్బందులకు కారణమైంది.

Image result for gemini ganesan & girl friends

ఇక జెమినీ యింకో అమ్మాయితో ఉన్నాడని తెలిశాకనే సావిత్రి అతనిపై కోపగించుకుని దూరమైందన్న కీలకమైన ఘట్టం గురించి. అలమేలు ఎందరో సవతులను సహించారు. వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు సావిత్రి  భర్త  'ఒన్‌ నైట్‌ స్టాండ్‌' ను కూడా సహించలేకపోయారు అన్నట్లు సినిమాలో చూపించారు. నిజానికి మధ్య తరగతి మోరల్స్‌ తో తీర్పు యివ్వాలంటే సావిత్రి అలమేలు అనే గృహిణి భర్తను వలలో వేసుకుని, ఆమె కాపురంలో నిప్పులు పోసింది. అందుకే కొంతకాలానికి దానికి పరిహారం చెల్లించింది అని చెప్పాలి. సావిత్రి ఆ కోణంలో ఆలోచించి, సమాధాన పడిందా?  భర్త స్త్రీ లోలత్వం గురించి ఆమె ఎంత సెన్సిటివ్‌? కెరియర్‌ గురించి అందరికీ తెలుస్తుంది.  కానీ యిలాటి వ్యక్తిగత విషయాల గురించి బయటకు తెలియదు. అప్పటి పరిస్థితులను పరిగణన లోకి తీసుకుని కొంత ఊహాగానం చేయాల్సిందే.


మొదటగా సావిత్రి పెళ్లి చేసుకునే నాటికే జెమినీ స్త్రీ లోలత్వం ఆమెకు తెలుసు. 'అలమేలును పెళ్లి చేసుకున్నాను. పుష్పవల్లితో సంబంధం ఉంది' అని సినిమా లోనే చెప్పించారు. పెళ్లి సరే, యిలా చిన్న యిల్లు మేన్‌టేన్‌ చేయడాన్ని సావిత్రి ఎలా జీర్ణించు కోగలిగింది? అప్పటి సామాజిక పరిస్థితులు, సినీరంగ పరిస్థితులు అలాటివి అని మనం గుర్తు పెట్టుకోవాలి.  మన మధ్యతరగతి మోరలిస్టిక్‌ కొలబద్దలతో వాళ్లను బేరీజు వేయకూడదు. జెమినీ యే ఒక చిన్నింటి వారసుడు. అతని తాత  బ్రాహ్మణుడు. ఆయనకు వేరే కుటుంబం ఉంది. దేవదాసి ఐన జెమినీ నాయనమ్మ తాతకు ఉంపుడు గత్తె.  జెమినీ తండ్రి మళ్లీ దేవదాసీ కుటుంబానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అందువలన జెమినీకి తను చేసినదానిలో వింతేమీ కనబడి వుండదు.


పుష్పవల్లి  (బాలీవుడ్ ప్రఖ్యాత కథానాయకి రేఖ తల్లి) విషయానికి వస్తే కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవదాసీ కుటుంబానికి చెందిన వ్యక్తి. సినిమారంగానికి వచ్చాక రంగాచారి అనే అతన్ని పెళ్లి చేసుకుని,  అతని ద్వారా ఒక కొడుకు (బాబ్జీ అని బాలనటుడు) కన్నాక, విడిపోయింది. కానీ అధికారికంగా విడాకులు తీసుకోలేదు. (1956 తర్వాతే విడాకుల చట్టం వచ్చింది)

Image result for gemini ganesan

పుష్పవల్లి సోదరికి వేదాంతం రాఘవయ్య గారితో సంబంధం ఉంది. వాళ్లకు పుట్టిన శుభ కూడా సినిమా నటి అయింది. జెమినీతో సంబంధం పెట్టుకున్నాక పుష్పవల్లికి రేఖ, రాధ పుట్టారు. ఆవిడకు పెద్దగా నటనావకాశాలు రాలేదు. తెలుగు, తమిళం మొత్తం కలిపి 20-25 సినిమాల్లో వేసింది. ''చెంచులక్ష్మి'' (1958) లో లీలావతి పాత్రలో ఆమెను చూడవచ్చు.


1955లో ఎమ్మెస్‌ ప్రకాశ్‌ అనే అవివాహితుడైన సంగీత దర్శకుడు ''ఇంటిగుట్టు'' (1958) సినిమా తీయడానికి యింకో ఆయనతో కలిసి ఫిల్మ్‌ కంపెనీ పెట్టి, పుష్పవల్లి        టి. నగర్‌ నివాసంలో ఒక వాటా అద్దెకు తీసుకున్నారు. అతనితో పుష్పవల్లి కి దోస్తీ కుదిరింది. నాలుగేళ్ల పాటు సాగింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. అతను ''మామకు తగ్గ అల్లుడు'' సినిమా కూడా తీశాడు. రెండింటి లోనూ సావిత్రే హీరోయిన్‌. ప్రకాశ్‌తో బంధం ఏర్పడ్డాక జెమినీ పుష్పవల్లి ద్వారా తనకు పుట్టిన పిల్లల సంగతి పట్టించుకోలేదు. రేఖకు ఆ విషయంలో ఆగ్రహం ఉంది. అందుకే 2005లో జెమినీ పోతే అంత్యక్రియలకు కూడా రాలేదు. ఆమె చెల్లి రాధ అమెరికాలో ఉంది.


' మా అక్క పెళ్లి లో సావిత్రి, పుష్పవల్లి, మా అమ్మకంటె ఎక్కువగా పెద్దరికం వహించారు ' అని డా.కమల చెప్పారు. అంటే యిది రహస్య వ్యవహారమేమీ కాదన్నమాట. తెలుగు, తమిళ సినీ రంగాలలో ఎందరో ప్రముఖులు, ఎమ్జీయార్‌, కరుణానిధి, నుంచి అనేకమంది వైవి రావు (లక్ష్మి తండ్రి), భీమ్‌ సింగ్‌ వంటి దర్శక నిర్మాతలకు యిటు వంటి వ్యవహారాలుండేవి. రెండిళ్ల వ్యవహారానికి ఘంటసాల కూడా మినహాయింపు కాదు. జెమినీ సహనటుడు, డిఎంకె నాయకుడు ఐన ఎస్‌ఎస్‌ రాజేంద్రన్‌ భార్య ఉండగానే సిఆర్‌ విజయకుమారి అనే హీరోయిన్‌తో సహజీవనం చేసి పిల్లల్ని కన్నాడు.


ఇద్దరూ విడిపోయాక తామరసెల్వి అనే యింకో ఆవిణ్ని చేసుకున్నాడు. జెమినీ పెద్ద భార్య కూడా ఆనాటి గృహిణుల్లాగానే భర్త వ్యవహారాలను ఆపే శక్తిలేక మిన్నకుందని అనుకుని ఊరుకోకూడదు. సావిత్రీ ఊరుకుందని మనం గ్రహించాలి. సావిత్రితో పరిచయానికి ముందు పుష్పవల్లితో సంబంధం ఉందనేకాదు, 1952లో సావిత్రి తో రహస్యవివాహం జరిగాక కూడా జెమినీ పుష్పవల్లితో సంబంధం కొనసాగించాడు. అందుకే 1954లో రేఖ పుట్టింది, తర్వాత రాధ పుట్టింది. ఇంత కంటె రుజువు ఏం కావాలి? సావిత్రి 1956 లో జెమినీతో తన వివాహాన్ని బహిర్గతం చేసిందంటే పుష్పవల్లి ఎఫయిర్‌ నూ ఆమోదించినట్లేగా!

Image result for gemini ganesan

నిజానికి సినీతారలకు వివాహేతర సంబంధాల విషయంలో వేరే రకమైన వేల్యూ సిస్టమ్‌ ఉంది. వీటి పట్ల మరీ అంత సెన్సిటివ్‌ గా ఉండకుండా, ఒక పరిమితి వరకు సహించే గుణం ఉంది. శ్రీరెడ్డి గొడవల్లో 'కాస్టింగ్‌ కౌచ్‌' గురించి చర్చ వచ్చినపుడు సినీ రంగ ప్రముఖులెందరో యివన్నీ ఎప్పణ్నుంచో ఉన్నవే కదా! యిప్పు డెందు కీ రచ్చ అన్నట్లు మాట్లాడారు. జెమినీ వంటి ఉమనైజర్‌ 1956 నుంచి 1967 వరకు (అప్పుడతని వయసు 36 సం. నుంచి 47 సం.) మడి కట్టుకుని ఉంటాడని మనం నమ్మగలమా?  సావిత్రి నమ్మి ఉంటారా? హీరో గా టాప్‌లో ఉన్నాడు. సరదాగా, తెలివిగా మాట్లాడుతూంటాడు  (షావుకారు జానకి యీ విషయం చెప్పారు) వద్దన్నా అమ్మాయిలు వచ్చి పడుతూంటారు.


అందువలన యీ విషయాల్లో సావిత్రి చూసీచూడనట్లే ఉండి ఉంటారు. కనీసం 1967 వరకు జెమినీపై సావిత్రి కి ఫిర్యాదులు లేవని అనుకోవడానికి తుర్లపాటి కుటుంబ రావు యీ మధ్య రాసిన వ్యాసం పనికి వస్తుంది. 1967లో నెల్లూరు లో సావిత్రి, జెమిని దంపతులకు సన్మానం చేస్తే తుర్లపాటి వెళ్లారు. ఆయన వద్దకు విజయవాడ నుంచి సావిత్రి పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి వచ్చి "సావిత్రిని వాడు మోసం చేస్తాడు. ఇప్పటికైనా విడాకులు తీసుకోమని మీరైనా చెప్పండి"  అన్నారు. 'వాళ్లకు 1952 లో పెళ్లయింది.


15 ఏళ్ల కాపురం అయి, యిద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకోమని ఎలా చెప్తామండి? అని తుర్లపాటి ఆయనకు చెప్పి, యీ సంగతి సావిత్రికి చెప్పారు. సావిత్రి సంతోషించి, 'బాగా చెప్పారు. మీరిలా హితవు చెప్పారని బావగారికి కూడా చెప్తానుండండి' అన్నారని తుర్లపాటి రాశారు. అంటే 1967వరకు వాళ్ల కాపురం బాగానే ఉందని అనుకోవాలి. ఆ ఏడాది అక్టోబరు లోనే  ''చిన్నారి పాపలు''  సినీ దర్శక నిర్మాతగా సావిత్రి మారారు.

Image result for gemini ganesan

జెమిని స్త్రీ లోలత్వం పట్ల సావిత్రి ఒక సాధారణ మధ్యతరగతి మహిళలా రియాక్టయిందని, వారి కాపురం విచ్ఛిన్నమవడానికి అదే ప్రధాన కారణమని సినిమాలో నాటకీయత కోసం చూపవచ్చు తప్ప, అది నిజమనుకోవాలని లేదు. అసలు కారణం - భర్త మాట లక్ష్యపెట్టకుండా సావిత్రి డబ్బుని చిత్తం వచ్చినట్లు ఖర్చు చేయడం అనుకోవాలి. సావిత్రి అద్భుతమైన నటి, మహాద్భుతమైన మంచి మనిషి. ఎవరేమడిగినా లేదనకుండా యిచ్చేసేది. ఇవన్నీ బయటవాళ్లకు బాగానే ఉంటాయి కానీ యింట్లో వాళ్లకు ఎలా ఉంటాయో ఊహించండి. మీరు ఒక పరిమితికి మించి సమాజ సేవ చేస్తానన్నా, దాన ధర్మాలు చేస్తానన్నా!


ఇన్‌కమ్‌టాక్స్‌ కట్టకుండా అవకతవకగా వ్యవహరాలు చేసినా మీ భార్య లేదా భర్త తప్పకుండా అడ్డుపడతారు. చేతకాకుండా వ్యాపారం చేస్తానంటే వద్దంటూ అవరోధాలు కల్పిస్తారు. దగా కోర్లను నమ్మి డబ్బు అప్ప చెప్పేస్తూ వుంటే మందలిస్తారు. కోప్పడతారు. జెమినీ చేసినదదే. సావిత్రి మరణానంతరం జెమినీపై నింద వస్తే అతను ప్రెస్‌ మీట్‌ పెట్టి లెక్కలన్నీ చెప్పాడనీ చదివాను. అప్పుడే కుమార్తె చాముండేశ్వరి సావిత్రిపై కేసు వేసిందని కూడా చెప్పాడట. వేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మైనర్ల ఆస్తిని మేజర్లు తగలేస్తూ ఉంటే ఆవిడ తన తరఫున, తన తమ్ముడి తరఫున తల్లిపై ఆంక్షలు విధించాలని కోర్టు వారిని కోరుతూ కేసువేసి ఉండవచ్చు. జెమిని డబ్బు దగ్గర జాగ్రత్తపరుడు. అతను దర్శకత్వం జోలికి పోలేదు.


సినిమా కూడా ఒక్కటే ఒక్కటి తీశాడు. ''ఓ మై నహీ''  సినిమా కథని ''నాన్‌ అవన్‌ ఇల్లయ్‌'' పేర తీస్తే అతనికి ఫిల్మ్‌-ఫేర్‌ ఎవార్డు వచ్చింది కానీ డబ్బులు రాలేదు.  సినీనిర్మాణం ప్రత్యేకమైన కళ. సావిత్రి మహా మొండి మనిషని ఎవరి మాటా వినదని హితవు చెప్పడానికి జెమినీ వెళితే కుక్కల్ని ఉసిగొల్పిందని, జెమినీ గోడ దూకి పారిపోవలసి వచ్చిందనీ జెమినీ పెద్ద భార్య కూతురే కాదు, రమాప్రభా చెప్పారు. 'మా అమ్మ అణ్నానగర్‌ లో అద్దె యింట్లో ఉండడానికి కారణం సొంత యిల్లు లేక కాదు, మా అందరి మీదా అలిగి..' అని చాముండేశ్వరే చెప్పారు.

Related image

ఇలాటి మొండి తనం వలన భార్యా భర్తల మధ్య గొడవలు రావడంలో ఆశ్చర్యం లేదు. ఆమె యింటికి వస్తే కొట్లాటలు, తిట్లు తప్ప వేరేవీ లేనప్పుడు జెమిని రాకపోవడం లో ఆశ్చర్యం లేదు. వెళ్లడానికి అతనికి వేరే యిల్లు ఉంది. గర్ల్‌ ఫ్రెండ్సూ ఉండి ఉంటారు. అన్నిటిని మించి కెరియర్‌ ఉంది. అతను ''రుద్రవీణ'' (1988), ''భామనే సత్యభామనే'' (1998) వరకు చురుగ్గా నటిస్తూనే ఉన్నాడు. సావిత్రి కోమాలోకి వెళ్లాక, తనపై విరుచుకు పడ లేదు కాబట్టి, అతను యథేచ్ఛ గా వచ్చి వెళుతూ వైద్యం చేయించాడు.

Image result for dr kamala selvaraj

ఆమె పోయిన తర్వాత పెద్ద భార్య యింటికి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు జరిపించాడు. కూతురు చాముండేశ్వరికి అప్పటికే పెళ్లయింది. కొడుకు సతీష్‌ను అక్కతో ఉంటావా? నాతో ఉంటావా? అంటే నీతో ఉంటానన్నాడు. అతన్ని చదివించి ఇంజనియర్‌ను చేశాడు. (అతనిప్పుడు అమెరికాలో ఉన్నాడు. తండ్రిని పన్నెత్తి మాటనడు) పెద్దభార్య నలుగురు కూతుళ్ల లో ముగ్గుర్ని డాక్టర్లను చేశాడు. వాళ్లలో ఒకరు దక్షిణ భారతదేశంలోనే తొలిసారి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సృష్టించిన గైనకాలజిస్టు డా. కమల. నాలుగో కూతురు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూపులో జర్నలిస్టు.


''మహానటి''  హిస్టరీపై ఆధారపడిన ఒక కల్పితగాథగానే మిగిలి వుంటే యిన్ని వివరాలు తెలుసుకోవలసిన పని లేదు. కానీ దాన్ని ఒక కల్ట్‌ సినిమా గా, వినోదపు పన్నుకి అర్హమైన సినిమాగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సావిత్రి ఆథరైజ్డ్‌ బయోగ్రఫీ లా పరిగణించేస్తున్నారు. రేపో మాపో దాన్ని స్కూలు పిల్లల సిలబస్‌ లో కూడా పెట్టమనే డిమాండ్‌ రావచ్చు. అందుకే వాస్తవాల గురించి యీ సుదీర్ఘ వివరణ.

Image result for gemini ganesan & girl friends

మరింత సమాచారం తెలుసుకోండి: