అతిలోక సుండరి అలనాటి తార శ్రీదేవి తొలి తనయ జాన్వి కపూర్ నటించిన తొలి సినిమా, మరాఠీ బ్లాక్బస్టర్ ‘సైరాత్’కు హిందీ రీమేక్ "ధడక్" వసూళ్ల పరంగా దూసుకు పోతోంది. గత శుక్రవారం (జులై 20) విడుదలైన ఈ సినిమా మంగళవారానికి దేశవ్యాప్తంగా ₹44 కోట్లు వసూళ్ళు సాధించినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు.
తొలిరోజున (శుక్రవారం) ₹ 8.71 కోట్లు, శనివారం ₹11.04 కోట్లు, ఆదివారం ₹13.92 కోట్లు, సోమవారం ₹5.52 కోట్లు, మంగళవారం ₹4.76 కోట్లు మొత్తం రూ.43.95 కోట్లు సాధించి నట్లు చెప్పారు.
జాన్వీ కపూర్ తన అందం, అభినయంతో ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, తొలి చిత్రమే అయినప్పటికీ ఇషాన్ ఖట్టర్ కూడా చక్కగా నటించాడు. తెరపై ఈ జంట రొమాన్స్ పండటంతో, శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే రూ. 33.67 కోట్లు కొల్లగొట్టింది.
అదే విధంగా సినిమా విదేశాల్లో మొత్తం రూ.11.55 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలో $498,000 డాలర్లు, యూఏఈ-జీసీసీలో $506,000 డాలర్లు, యూకే-ఐర్లాండ్లో $200,000 డాలర్లు, ఆస్ట్రేలియా+న్యూజిలాండ్లో $176,000 డాలర్లు మొత్తం $1.68 మిలియన్ డాలర్లు (రూ.11.55 కోట్లు) వసూళ్ళు రాబట్టినట్లు ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపించిన వారికి జాన్వి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెప్పారు. గొప్పగా ఉందని, ఆశీర్వాదాలు పొందిన భావన కలిగిందని పోస్ట్ చేశారు. సినిమా సెట్ లో తీసిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. "ధడక్" సినిమా లో హీరో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ కథానాయకు డిగా నటించారు. అశుతోష్ రానా, అంకిత్ బిష్ట్, ఆదిత్య కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. శశాంక్ ఖైతాన్ దర్శకుడు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలు.
మరాఠీ సైరత్ సినిమా ఫుల్ రన్ లో సుమారు ₹ 4 కోట్ల బడ్జెట్ తో రూపొందగా, దాదాపు వంద కోట్లపైనే కలెక్షన్స్ని కొల్లగొట్టింది. తాజాగా 'ధడక్' తొలి 5 రోజుల్లో ₹ 43.95 కోట్లు సాధించినట్లు దర్శకుడు శశాంక్ చెప్పారు.