భారత దేశంలో సంచలనం సృష్టించిన డేరా బాబా కేసు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ మెడకు చుట్టుకుంది. 2015లో బెహ్బాల్ఖాన్, కోట్కాపుర ప్రాంతాల్లో సిక్కు మద్దతుదారులు చేపట్టిన ఆందోళనలో భాగంగా వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు అరవై మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, డేరాబాబా, సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఈ ఘర్షణల్లో అక్షయ్తో పాటు అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గుర్మీత్ సింగ్, బాదల్లకు సంబంధం ఉందని ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో చండీగఢ్ న్యాయస్థానం విచారణకు హాజరు కావాల్సిందిగా అక్షయ్, బాదల్కు నోటీసులు పంపించింది. ఈ మేరకు అక్షయ్ నేడు సిట్ ఎదుట హాజరయ్యారు. 2018లో జస్టిస్ రంజిత్ సింగ్ ఏర్పాటు చేసిన ప్యానెల్ అక్షయ్ పేరును ప్రస్తావించింది. కాగా డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్, మాజీ సీఎం సుక్బీర్ సింగ్ బాదల్ల మధ్య రూ. వంద కోట్ల ఒప్పందానికి సంబంధించి మధ్యవర్తిత్వం వహించారనే ఆరోపణలపైనా అక్షయ్కుమార్ను సిట్ ప్రశ్నించనుంది.
మరోవైపు బాలీవుడ్ నటుడిని ప్రశ్నించేందుకు సిట్ సమన్లు జారీ చేయగా, ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మరోవైపు ఈ కేసులో అక్షయ్ను ప్రత్యక్ష్య సాక్షిగా సిట్ పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. నన్ను అనవసరంగా ఈ కేసులో కావాలని ఇరికించారని..ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ఒక సినిమా స్ట్రిప్టులా కనిపిస్తుందని అన్నారు.
2011లో ఓ ఈవెంట్ కోసం పంజాబ్ వెళ్లాను. ఆ సమయంలో నేను సుఖ్బీర్ బాదల్ను కలిశాను. అయితే 2015లో నా నివాసంలో నేను బాదల్, డేరా బాబాతో సమావేశమయ్యానని వార్తలు వెలువడుతున్నాయి. అందులో వాస్తవంలేదు. ఆ సమయంలో నేను ‘బేబీ’, ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ చిత్రాలతో బిజీగా ఉన్నానని అక్షయ్ అంటున్నారు. భవిష్యత్ లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరగబోతుందో చూడాల్సిందే.