టాలీవుడ్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి సహజమైన నటన మరియు కామెడీ పండించగల నటులు ఎవరంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేర్లు విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా రవితేజ. వీరిద్దరి కలయికలో త్వరలో ఒక భారీ మల్టీస్టారర్ రూపొందనుందని సమాచారం. వివరాల్లోకి వెళితే, గత కొన్నేళ్లుగా సరైన బాక్సాఫీస్ విజయం దక్కని విక్టరీ వెంకటేష్, ఇటీవల సంక్రాంతి కానుకగా వరుణ్ తేజ్ తో కలిసి నటించిన సినిమా ఎఫ్2. హ్యాట్రిక్ విజయాలు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించి, వెంకటేష్ కి సినిమా కెరీర్ పరంగా మళ్లీ చరిష్మానిచ్చిందని చెప్పాలి. 


ఇకపోతే అదే ఊపులో వెంకటేష్ ప్రస్తుతం, మేనల్లుడు నాగచైతన్యతో కలిసి బాబీ దర్శకత్వంలో వెంకీ మామ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్నేళ్ల క్రితం వెంకటేష్, శ్రీనువైట్ల కాంబినేషన్లో నమోవెంకటేశ వంటి సూపర్ హిట్ మూవీ ని అందించిన 14 రీల్స్ సంస్థ, ఆయనతో మరొక చిత్రం చేయాలని, అలానే మాస్ మహారాజా రవితేజ తో కూడా ఓ సినిమా చేయాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తోంది. ఇకపోతే ఇటీవల బిందాస్, రగడ చిత్రాల దర్శకుడు వీరుపోట్ల, 14 రీల్స్ సంస్థ వారిని కలిసి తన వద్దనున్న ఇద్దరుహీరోల కథను వారికి వినిపించాడట. అయితే ఈ కథకు వెంకటేష్ మరియు రవితేజ అయితే కరెక్ట్ గా సూట్ అవుతారని భావించిన నిర్మాత అనిల్ సుంకర, వారిద్దరికీ కథ చెప్పమని వీరుకి చెప్పడం, వెంటనే ఆయన అటు వెంకీకి ఇటు రవితేజకు కథను వినిపించడం, అనుకున్నట్లుగానే ఇద్దరికీ కథ నచ్చటంతో అతి త్వరలో 14రీల్స్ బ్యానర్ లో వెంకటేష్ మరియు రవితేజ కథానాయకులుగా ఆ భారీ మల్టీస్టారర్ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 


అంతేకాదు ఈ సినిమాలో వారిద్దరి సరసన ఇద్దరు ప్రముఖ స్టార్ హీరోయిన్లు కూడా తీసుకోవాలని చూస్తున్నారట నిర్మాతలు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో మీడియా వారికి కూడా అధికారికంగా తెలియజేయటం జరుగుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. స్క్రీన్ పై తమ మార్క్ సహజ నటన మరియు తమ మార్క్ కామెడీ పంచ్ లతో ఆకట్టుకునే ఈ నటులు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో చేయటం నిజంగా వారి వారి అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షుకులకు కూడా కన్నులపండుగ లాంటి వార్త అని చెప్పాలి. కాగా ప్రస్తుతం వార్త టాలీవుడ్ సినిమా వర్గాల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: