పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత ఇంత వరకు నోరు మెదప లేదు. కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు. అయితే అమరావతి పరిధిలో ఓ దేవాలయానికి దాదాపు కోటిన్నర విరాళంగా ఇవ్వడం మినహాయిస్తే, పవన్‌ నుంచి పొలిటికల్‌ స్టేట్‌మెంట్‌ ఏదీ పోలింగ్‌ ముగిశాయ బయటకు రాలేదు. పవన్‌కళ్యాణ్‌ అమరావతి నుంచి సైన్‌ ఔట్‌ అయి, హైద్రాబాద్‌లో సైన్‌ ఇన్‌ అయ్యారనే విషయం స్పష్టమవుతోంది.


ఇక, తాజాగా పవన్‌కళ్యాణ్‌ తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ తాజా సినిమా 'చిత్రలహరి'ని మెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని మైత్రీమూవీ మేకర్స్‌, సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. పవన్‌, పంపిన బొకే ఫొటోని ట్వీట్‌ చేసింది మైత్రీ మూవీమేకర్స్‌. నిజానికి గతంలో పవన్‌కళ్యాణ్‌తో సినిమా కోసం మైత్రీ మూవీమేకర్స్‌ ప్రయత్నించిన విషయం విదితమే. రాజకీయాల్లోకి వెళ్ళడంతో పవన్‌ ఆ సినిమా చేయలేకపోయాడు. అడ్వాన్స్‌ విషయంలో కొంత 'రచ్చ' జరిగిందంటూ చాలా ఊహాగానాలు తెరపైకొచ్చాయనుకోండి.. అది వేరే విషయం.


ఇదిలావుంటే, నిర్మాత రామ్‌ తాళ్ళూరి ఇప్పటికే పవన్‌తో సంప్రదింపులు జరిపి, ఓ సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ ఓ గాసిప్‌ తెరపైకొచ్చింది. అటు మైత్రీ మూవీమేకర్స్‌, ఇటు రామ్‌ తాళ్ళూరి.. రేపు ఇంకెవరి పేరు విన్పిస్తుందోగానీ, పవన్‌ కూడా సినిమాల పట్ల మళ్ళీ ఒకింత ఆసక్తి చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నికల కోసం సమర్పించిన అఫిడవిట్‌లో ఆయా సినీ నిర్మాణ సంస్థల వద్ద అప్పు తీసుకున్న విషయాన్ని పవన్‌ ప్రస్తావించిన విషయం విదితమే. అది అప్పుకాదు, అడ్వాన్స్‌లనీ.. ఆయా అడ్వాన్స్‌లకు సంబంధించి 'పని పూర్తి చేయడానికే' పవన్‌ కట్టుబడి వున్నారనీ, ఈ క్రమంలో పవన్‌ వరుస సినిమాలు ఒప్పుకోబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: