యువ‌ర‌త్న నంద‌మూరి బాలకృష్ణ‌కు ఈ యేడాది సినిమాల ప‌రంగా క‌లిసి రాలేదు. త‌న తండ్రి దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు రెండు సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యి బాల‌య్య‌కు కెరీర్‌లోనే పెద్ద పీడ‌క‌ల‌ను మిగిల్చాయి. ఈ రెండు సినిమాల త‌ర్వాత బాల‌య్య తాను ఏపీలోని హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డంతో ప్ర‌చార వ్య‌వ‌హారాల్లో బిజీ అయిపోయాడు. ఇక ఎన్నిక‌లు కంప్లీట్ కావ‌డంతో బాల‌య్య తిరిగి సినిమాలు ప్రారంభించేస్తున్నాడు.


త‌న‌కు ఇటీవ‌ల కాలంలో రెండు హిట్లు ఇచ్చిన ఇద్ద‌రు టాప్ డైరెక్ట‌ర్ల‌తో బాల‌య్య ఫిక్స్ అయిపోయాడు. బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో సినిమా అంటేనే ఫుల్‌ క్రేజ్‌ ఉంటుంది. వీరి కాంబినేష‌న్ల‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరి కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ కాంబినేష‌న్‌పై కొద్ది రోజులుగా వ‌స్తోన్న వార్త‌ల‌కు బోయ‌పాటి క్లారిటీ ఇచ్చేశాడు. గురువారం బోయ‌పాటి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు రెండో వారం నుంచి బాల‌య్య ప్రాజెక్టు ప‌ట్టాలెక్కిస్తాన‌ని... వచ్చే వేసవికి విడుదల చేయాలనుకుంటున్న‌ట్టు చెప్పాడు.


ఇక బోయ‌పాటి ప్రాజెక్టు సంగ‌తి ప‌క్క‌న పెడితే గ‌త సంక్రాంతికి బాల‌య్య 102వ ప్రాజెక్టుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన జై సింహా హిట్ అయ్యి బాల‌య్య సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ చేసింది. ఇప్పుడు కెఎస్‌.ర‌వికుమార్ చెప్పిన క‌థ బాల‌య్య‌కు న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్టును సైతం సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సీ.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నారు. మే లో పూజా కార్యక్రమాలు జరుపుకుని, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ రెండు సినిమాలు కూడా ఊర‌మాస్ డైరెక్ట‌ర్ల‌తో ఊర‌మాస్ క‌థ‌ల‌తోనే తెర‌కెక్క‌నున్నాయి. బాల‌య్య మ‌ళ్లీ ర‌చ్చ ర‌చ్చ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: