టాలీవుడ్లో ఒకప్పుడు వరుస హిట్లు కొడుతూ స్టార్ హీరోలే ఈ డైరెక్టర్తో సినిమా చేయాలని తపన పడే స్టేజ్లో ఉన్నా వి.వి.వినాయక్ ఇప్పుడు ఏ చిన్న హీరో ఛాన్స్ ఇచ్చినా ఒక్క సినిమా చేద్దామన్న స్టేజ్కు పడిపోయాడు. అఖిల్ సినిమా తర్వాత వినాయక్ ఫామ్ అధః పాతాళానికి పడిపోయింది. ఆ తర్వాత చిరు ఖైదీ నెంబర్ 150 సినిమా హిట్ అయినా అది రీమేక్. ఆ సినిమాలో వినాయక చేయటానికి ఏం లేదు ఇంకా చెప్పాలంటే వినాయక్ను పూర్తిగా డమ్మీగా చేసి మెగా కాంపౌండ్ ఆ సినిమాను తీసుకుందన్న గుసగుసలు కూడా ఉన్నాయి. ఖైదీ హిట్టయినా వినాయక్కు పేరు రాలేదు. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో వినాయక్ తీసిన ఇంటిలిజెంట్ సినిమా వినాయక్ డైరెక్షన్ సామర్థ్యాన్ని ప్రశ్నించింది. ఇంటిలిజెంట్ సినిమా చూసిన వారు వినాయక్ డైరెక్షన్ మరిచిపోయాడా ? లేదా ఫామ్లో లేడా ? అన్న సందేహాలు కూడా వ్యక్తం చేశారు.
ఇంటిలిజెంట్ ప్లాప్ అయినా కూడా వినాయక్ నిర్మాత సి.కళ్యాణ్ ఇచ్చిన కమిట్మెంట్తో కళ్యాణ్ కోసం మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. సీ కళ్యాణ్ బాలయ్యతో కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో జై సింహా సినిమా నిర్మించాడు. గత సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. వినాయక్ కళ్యాణ్కి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం బాలయ్యతో ఓ సినిమా చేయాలని ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. వినాయక్ కూడా ఓ కన్నడ హిట్ సినిమాకు రీమేక్గా బాలయ్యతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు కూడా. దీంతో బాలయ్య - వినాయక్ కాంబినేషన్ చెన్నకేశవరెడ్డి తర్వాత మరోసారి ఫిక్స్ అవటం ఖాయమని అందరూ అనుకున్నారు.
అయితే బాలయ్య వినాయక్కు షాక్ ఇస్తూ మళ్లీ కె.ఎస్.రవికుమార్ని నమ్ముకున్నాడు. అటు బోయపాటి సైతం బాలయ్య కోసం కథ పట్టుకుని ఐదారు నెలలుగా వెయిట్ చేస్తున్నా బాలయ్య ముందుగా కె.ఎస్.రవికుమార్కే ఓటు వేయడం అందరినీ షాక్కు గురి చేసింది. బాలయ్య ముందుగా కేఎస్ రవికుమార్కు ఆ తర్వాత బోయపాటికి ఛాన్స్ ఇచ్చాడు. బాలయ్యను నమ్ముకుని ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్న వినాయక్ మాత్రం నిండా మునిగి పోయాడు... పాపం వినాయక్ అనుకోక తప్పదు ఏమో..? మళ్లీ వినాయక్కు ఇప్పుడున్న ఫామ్ను బట్టి చూస్తే ఎవరు ఛాన్స్ ఇస్తారో ? వినాయక్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ? కూడా ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి.