రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన జీవా ఆ తర్వాత ఇక్కడ హిట్ కోసం నానా పాట్లు పడుతూనే ఉన్నాడు. జీవా తాజా చిత్రం తెలుగులో కీ పేరుతో శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు డిఫరెంట్ సినిమా, సూపర్ సైబర్ క్రైం థ్రిల్లర్ అన్న టాక్ వచ్చింది. ఈ సినిమా కథా పరంగా చూస్తే హ్యాకింగ్లో జీనియస్ అయిన జీవా తాను కనిపెట్టిన బాషా వైరస్ ద్వారా అమ్మాయిల ఫోన్లు హ్యాక్ చేసి వారి పర్సనల్ మెసేజ్లు తెలుసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే విలన్లు (ఇతర హ్యాకర్లు) డిప్రెషన్లో ఉన్న వాళ్లను హ్యాక్ చేసి వాళ్లను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వారితో కొంతమంది అమాయకులను చంపించేస్తుంటారు. చివరకు జీవా కూడా వాళ్లకు టార్గెట్ అవుతాడు. చివరకు జీవా వాళ్ల పని ఎలా పట్టాడు అన్నదే సినిమా స్టోరీ. ఈ ప్రయాణంలో అతడికి హీరోయిన్లు నిక్కి గల్రానీ, అనైక సోటీతో ఎలాంటి రిలేషన్ ఉందన్నది కూడా ముఖ్యమే.
ఈ సినిమా దర్శకుడు కలీస్ సాంకేతికత వల్ల వచ్చే మరో ఇబ్బందికర కోణాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చేసిన ఆలోచన బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాలో ఉత్కంఠభరిత సన్నివేశాలు, హ్యాకర్ను పట్టుకునేందుకు వేసే ఎత్తులు, హీరో, విలన్ మైండ్గేమ్ సన్నివేశాలు చక్కగా ఉన్నాయి. టెక్నాలజీ వల్ల ఉపయోగంతో పాటు ఎంత నష్టం ఉంటుందో మంచి మెసేజ్ కూడా ఇచ్చారు.
దర్శకుడు రాసుకున్న స్టోరీ బాగున్నా దానిని తెరమీదకు తీసుకురావడంలో దర్శకుడు కలీస్ ఆసక్తికరమైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఫస్టాఫ్లో గంట వరకు అసలు కథలోకి వెళ్లకపోవడం, సెకండాఫ్లో చాలా సీన్లు సాగదీసినట్టు ఉండడం మైనస్. దర్శకుడు కథ మంచిదే తీసుకున్నా దానిని ఆసక్తిగా తెరకెక్కించలేదన్న కంప్లెంట్ ఉంది. హీరో విలన్లకు మధ్య మైండ్ గేమ్ ఇంకా బాగా ప్రజెంట్ చేయాల్సింది. బి.సి ఆడియన్స్ కి ఈ సినిమా అస్సలు కనెక్ట్ అయ్యేలా లేదు. ఏదేమైనా కీ కమర్షియల్ సక్సెస్ ఎలా ఉన్నా మంచి సందేశాత్మక చిత్రంగా మాత్రం నిలుస్తుంది.