టాలీవుడ్, కోలీవుడ్ లో హర్రర్ కాన్సెప్ట్ కే కొత్త అర్థాన్ని తీసుకు వచ్చారు లారెన్స్. ముని సినిమాతో ప్రారంభం అయిన ఈ ట్రెండ్ కాంచన, గంగా రీసెంట్ గా కాంచన 3 తో సక్సెస్ గా సాగుతుంది. ఈ సినిమా కన్నడ లో కూడా రిమేక్ చేశారు. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ లో తీయాలని చూస్తున్నారు..అక్షయ్ కుమార్ హీరోగా ఈ సినిామకు ‘లక్ష్మీబాంబ్’అని టైటిల్ కూడా పెట్టారు. తాజాగా రాఘవ లారెన్స్ 'లక్ష్మీ బాంబ్' ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.
లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన 'కాంచన'కు ఇది హిందీ రీమేక్. ఈ సినిమాను లారెన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శనివారం నాడు విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పై కొత్త ఇబ్బందులు వచ్చిపడ్డాయి. అయితే లారెన్స్ కి చెప్పకుండా ఈ పోస్టర్ రిలీజ్ చేయడం పై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు. ''గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదని తమిళంలో ఓ సామెత ఉంది. గౌరవం లేని ఇంట్లో అడుగు పెట్టకూడదని అంటుంటారు. ఈ ప్రపంచంలో పేరు, ప్రతిష్టల కంటే వ్యక్తిగత గౌరవం చాలా ముఖ్యమైంది. అందుకే లక్ష్మీ బాంబ్ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేస్తున్నాను. ఒక కారణమని చెప్పలేను, చాలా కారణాలున్నాయి.
అందులో ఒక ఉదాహరణ.. సినిమా ఫస్ట్ లుక్ను కనీసం నా అవగాహన లేకుండా విడుదల చేశారు. నాతో డిస్కషన్ కూడా చేయలేదు. మూడో వ్యక్తి ద్వారా నాకు అసలు విషయం తెలిసింది. ఇతరుల నుండి తన సినిమాకు సంబంధించిన విషయాలను తెలుసుకునే పరిస్థితి దర్శకుడికి రావడం చాలా బాధాకరం. నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టే 'లక్ష్మీబాంబ్' ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలనుకుంటున్నాను'' అంటూ వెల్లడించారు. రీమేక్ సినిమా కాబట్టి స్క్రిప్ట్ వెనక్కి ఇచ్చేయాలని అడగడం లేదని.. అలా అని దర్శకుడిగా సినిమాను కొనసాగించలేనని అన్నారు.
తనకు అక్షయ్ కుమార్ సర్ అంటే ఎంతో అభిమానమని.. అందుకే స్క్రిప్ట్ వెనక్కి తీసుకోవాలనుకోవడం లేదని.. వారికి నచ్చిన దర్శకుడిని ఎంచుకోవచ్చని చెప్పారు. ఈ విషయం గురించి అక్షయ్ కుమార్ తో చర్చిస్తానని అన్నారు.