మానసికంగా సరైన ఎదుగుదల లేని పిల్లలే... స్పెషల్ కిడ్స్. దేశంలో ఇలాంటివారి సంఖ్య 5 లక్షలకుపైనే. సరిపల్లి కోటిరెడ్డి కుమారుడికీ ఇలాంటి సమస్యే వచ్చింది. వైద్యుల దగ్గరికి తీసుకెళితే ఆటిజం (బుద్ధి మాంద్యం) అని చెప్పారు. అయితే కోటిరెడ్డి దానిపై పూర్తిస్థాయిలో శోధించారు.
రుగ్మతేంటో తెలుసుకున్నారు. చికిత్సతో కొంతవరకూ నయం చేయగలిగారు. అలాగని అక్కడితో ఆగిపోలేదు!! అలాంటి పిల్లలకు తగిన విద్య, ఇతర సేవలు అందించడానికి ‘పినాకిల్ బ్లూమ్స్’ను ఏర్పాటు చేశారు. ఇపుడు దాన్ని విస్తరించే పనిలో పడ్డారు. కంపెనీ గురించి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే...
‘‘మా బాబుకి 20 నెలలున్నప్పుడు ఆటిజం అని డాక్టర్ చెప్పారు. ఆ బాధ నుంచి కొద్ది రోజుల్లోనే తేరుకుని నిజంగా ఆటిజం ఉందా అని అధ్యయనం చేశాను. చివరకది సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ (వినికిడి సమస్య) అని తేలింది. పిల్లాడికి కాక్లియర్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయించాం.