‘కన్నుగీటి’న వీడియోతో ఒక్కసారిగా పాపులర్ అయి ఓవైర్ నైట్ స్టార్‌గా మారిపోయిన మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రియా వారియర్ నటించిన మలయాళ సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’ పేరిట విడుదలైంది. అయితే, ప్రోమో వీడియోలతో విపరీతంగా పాపులర్ అయిన ప్రియా.. సినిమాతో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ఘోరంగా విఫలమవడంతో ప్రియా వారియర్ గురించి ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. అయితే, ఆమె మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నట్టు సమాచారం. 


అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న ప్రియా వారియర్‌కు నితిన్ హీరోగా నటిస్తోన్న సినిమాలో హీరోయిన్‌ పాత్ర దక్కిందని అంటున్నారు. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా వారియర్‌ను తీసుకున్నారని సమాచారం. ఇదే నిజమైతే తెలుగులో ప్రియా వారియర్‌కు మంచి స్కోప్ దొరికినట్టే. ఒక వేళ ఈ సినిమాలో నటించి హిట్టయితే గనుకు ఆమెకు ఇక్కడ కూడా అవకాశాలు పెరుగుతాయి. 


కాగా, నితిన్ ప్రస్తుతం ‘భీష్మ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్ట్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ‘లై’, ‘ఛల్ మోహన్‌ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’.. ఇలా వరస ఫ్లాపులతో డీలా పడిన నితిన్‌కు వెంకీ, చంద్రశేఖర్ యేలేటి సినిమాలు ఊరటనిస్తాయో లేదో చూడాలి! 
 


మరింత సమాచారం తెలుసుకోండి: