కింగ్ నాగార్జున హీరోగా మనం ఎంటర్ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్కామ్ 18 స్టూడియోస్ పతాకాలపై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా మన్మథుడు 2. నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఒక షెడ్యూల్ మినహా సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. త్వరలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన టాకీ పార్ట్ లో సమంత, కీర్తి సురేష్ కు సంబంధించిన సన్నివేశాలాను చిత్రీకరించారు.
ఇందులో భాగంగానే ఈ సినిమాలోని నాగార్జున స్టైలిష్ లుక్తో పాటు నాగార్జున-సమంత, నాగార్జున- రకుల్, నాగార్జున- కీర్తిసురేష్ ఫోటోలు విడుదల చేయగా అవి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా జూన్ 13న ఈ సినిమా టీజర్ను విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. అంతేకాదు ఈ టీజర్లో అన్నీ ఎమోషన్స్ ని చూపించబోతున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.
ఇంతకుముందు నాగార్జున-సోనాలి బింద్రే జంటగా మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కథ కథనాలతో కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మథుడు కి సీక్వెల్గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ ఫన్ రైడర్ తెరకెక్కుతోంది. ఆర్.ఎక్స్.100 ఫేం చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్ట్ 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.