ఈ సారి ఎన్నికలలో చాలామంది చిత్ర పరిశ్రమనుండి సెలబ్రిటీలు తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. వాళ్ళలో పెద్ద పెద్ద స్టార్ల నుండి అవకాశాలు లేక ఫేడవుట్ అయిన నటీనటుల వరకూ చాలామంది ఉన్నారు. అయితే ఈసారి ఎక్కువమంది సినిమా సెలబ్రిటీలకు ఎన్నికల సమరంలో సినిమా అట్టర్ ఫ్లాపయింది. అంటే పోటీ చేసిన స్థానాలలో గెలవలేకపోయారు. ఆ లిస్టులో మాజీ టాలీవుడ్ హీరోయిన్ మాధవిలత కూడా ఉన్నారు.
'నచ్చావులే'.. 'స్నేహితుడా' లాంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులల్లో గుర్తింపు తెచ్చుకున్న మాధవి లత కెరీర్ తర్వాత స్లో అయిపోయింది. అవకాశాలు రాక చాలా స్ట్రగుల్ పడింది. పూరీ జగన్నాథ్ లాంటి డైరెక్టర్స్ ని కలిసినా ప్రయోజనం లేకపోయింది. ఇక ఎన్నికలకు కొంతకాలం ముందు బీజేపీలో చేరిన మాధవికి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ సంపాదించుకుంది. టాలీవుడ్ సెలబ్రిటీ కావడంతో జనాల్లో గుర్తింపు ఉన్నప్పటికీ గెలుపుకు అది సరిపోలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత మాధవి లత మళ్ళీ ఎంటర్టైన్మెంట్ రంగం వైపు చూస్తోందట.
ఈమధ్యే మాధవికి తెలుగు బిగ్ బాస్ 3 లో పాల్గొనేందుకు నిర్వాహకుల నుండి ఆఫర్ వచ్చిందట. భారీ పాపులారిటీ ఉన్న ఈ రియాలిటీ షోలో పాల్గొంటే మళ్ళీ తన క్రేజ్ పెంచుకోవచ్చనే ఆలోచనలో మాధవి లత ఉందని సమాచారం. అయితే త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే గనక జరిగితే మాధవికి మళ్ళీ సినిమాలలో అవకాశం వచ్చే ఛాన్సెస్ బాగానే ఉంటాయి.