ఢిల్లీ బ్యూటీ తాప్సీ ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. టాలీవుడ్‌ ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన తాప్సీ ఆ తరవాత తన సామ్రాజ్యా్న్ని బాలీవుడ్‌కు విస్తరించారు. హిందీలో మంచి కథలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. హిందీ, తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కథలు, పాత్రల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకుంటోన్న తాప్సీ తాజాగా ఎంపిక చేసుకున్న మరో వైవిధ్యమైన కథ ‘గేమ్ ఓవర్’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన థ్రిల్లర్ డ్రామా ఇది. 


నయనతారతో ‘మయూరి’ లాంటి సినిమాను తీసిన అశ్విన్ శరవణన్ ‘గేమ్ ఓవర్’ను తెరకెక్కించారు. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్ ఈ సినిమాను నిర్మించారు. రోన్ ఏహాన్ యోహాన్ సంగీతం సమకూర్చారు. ఇండియన్ సినిమాలోనే ఇలాంటి కథను ఇప్పటి వరకు చూడలేదని ఇటీవల మీడియా సమావేశంలో తాప్సీ చెప్పారు. సినిమాలో తాను 60 శాతం వీల్ చైర్‌లోనే ఉంటానన్నారు. ట్రైలర్‌తో ఆసక్తి పెంచిన ‘గేమ్ ఓవర్’.. తాప్సీ చెప్పిన విశేషాలతో అంచనాలను పెంచింది. ఈ సినిమా నేడు (జూన్ 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి ‘గేమ్ ఓవర్’కు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. 


సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉందని అంటున్నారు. ఒక ప్రేక్షకుడు అయితే గడిచిన పదేళ్లలో తాను చూసిన బెస్ట్ థ్రిల్లర్ అని కితాబిచ్చేశారు. ఇక తాప్సీ నటన అయితే అద్భుతమట. ఆమెకు నేషనల్ అవార్డు రిజర్వ్ అయిపోయిందని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. అంత బాగా నటించిందట. అశ్విన్ శరవణన్ రాసుకున్న కథ, దాన్ని తెరపై చూపించిన విధానం అద్భుతంగా ఉందంటున్నారు. మొత్తం మీద సినిమా అయితే ఒక మాస్టర్ పీస్ అని కొనియాడుతున్నారు. ఇంత మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోన్న ‘గేమ్ ఓవర్’.. బాక్సాఫీసు వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి! 


మరింత సమాచారం తెలుసుకోండి: