ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తే తప్ప, ఇండస్ట్రీ లో ముందుకు వెళ్లలేం. పోస్టర్లు వేశామా.. టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశామా.. టీవీల్లో యాడ్స్ ఇచ్చామా.. సినిమా విడుదల చేశామా అని చేతులు దులుపుకుంటే ఈ రోజుల్లో చాలా కష్టం. ప్రమోషన్ల తీరు చాలా మారిపోయింది. సోషల్ మీడియా ద్వారా నిరంతరం సినిమాను వార్తల్లో నిలబెట్టాలి. ప్రమోషన్లలో కూడా వైవిధ్యం చూపించాలి. ఏదో రకంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి వాళ్లలో సినిమా గురించి చర్చ జరిగేలా చేస్తే తప్ప థియేటర్లకు రప్పించడం కష్టం.

 

ప్రమోషన్లలో ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తేనే ప్రేక్షకులతో కనెక్టయ్యే అవకాశముంటుంది. ఈ క్రమంలోనే ‘నిను వీడని వీడను నేనే’ చిత్ర బృందం దీని ప్రమోషన్లను చాలా వైవిధ్యంగా చేస్తోంది. హైదరాబాద్‌లోని ఒక మల్టీప్లెక్స్‌లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు చూసి జనాలు షాకైపోయారు. పురుషుల వాష్ రూంలో పాస్ పోసే చోట పైన దీని పోస్టర్లు పెట్టి.. ప్రేక్షకుల్ని షాక్‌కు గురి చేయడం విశేషం.

 

ఒక పోస్టర్లో ఏమో.. ‘‘థియేటర్లో నీ పక్కన కూర్చున్నది నేనే. దయ్యం కదా కనిపించలేదు’’ అన్న వ్యాఖ్య పెట్టారు. మరో పోస్టర్లో.. ‘‘నాకు హార్రర్ సినిమాలంటే ఇష్టం. జిప్పు వెయ్యి ప్లీజ్’’ అన్నారు. ఈ ఫన్నీ కామెంట్లతో ఉన్న పోస్టర్లు చూసి జనాలు నవ్వుకుని.. ఇదేంరా ప్రమోషన్‌రా బాబూ అనుకుంటూనే సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ‘నిను వీడని నీడను నేనే’ సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం. దీనికి నిర్మాత కూడా అతనే. ఇది హార్రర్ కథాంశంతో తెరకెక్కిన సినిమా.

 

ఇందులో హీరో ఒక రోజు ఉదయం లేచి అద్దంలో చూసుకుంటే వేరే ప్రతిబింబం కనిపిస్తుంది. అతడిలో దయ్యం చేరడంతో వచ్చిన మార్పు ఇది. ఆ పరిస్థితుల్లో అతనేం చేశాడన్నది మిగతా కథ. కార్తీక్ రాజు అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. ఇందులో వెన్నెల కిషోర్ దయ్యం పాత్రలో కనిపించనుండటం విశేషం. .జులై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: