టాలీవుడ్లో వచ్చే సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలతో బాక్సాఫీస్ సమరం హీటెక్కనుంది. వచ్చే సంక్రాంతికి ఇప్పటికే రెండు సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయి. మహర్షి హిట్ తర్వాత మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇదే టైమ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాని సైతం సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాను ముందుగా డిసెంబర్ కు ప్లాన్ చేసుకున్నారు. డిసెంబర్లో వస్తే సినిమా మార్కెట్ దృష్ట్యా వసూళ్లు తక్కువగా వస్తాయని... చిత్ర యూనిట్ సంక్రాంతికి సినిమాను వాయిదా వేసుకుంది. అయితే అప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ బాబు ఉన్నాడు. రెండు భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో ఈ రెండు సినిమాలలో ఏది పైచేయి సాధిస్తుందన్న ఆసక్తి ఉండగానే... ఇప్పుడు మరో సినిమా కూడా సంక్రాంతి రేసులో నిలిచింది.
ఇటీవల షూటింగ్ ప్రారంభమైన బాలకృష్ణ - కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా సైతం సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సంక్రాంతి హీరోగా పేరున్న బాలయ్య కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటించిన జై సింహ సినిమా సైతం సంక్రాంతికి రిలీజ్ అయ్యి కమర్షియల్గా హిట్ అయ్యింది. దీంతో బాలయ్య ఈ రెండు పెద్ద సినిమాల మధ్యలో తన సినిమాను రిలీజ్ చేస్తాడా ? అన్నది చూడాలి. ఏదేమైనా సంక్రాంతికి మహేష్ వర్సెస్ బన్నీ సినిమాలతో బాక్సాఫీస్ వార్ అదిరపోవడం ఖాయం.