రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్న బాబు తొలిసారి డైరెక్టర్ గా రాబోతున్నారు. ఆది సాయి కుమార్ హీరో గా నటించారు. హెచ్ కె శ్రీకాంత్ దీపాల నిర్మాత. దీపాల ఆర్ట్స్ నిర్మించింది. ఈ సినిమాను జూలై 5న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ``మనసుకు నచ్చిన వ్యక్తి డైమండ్ రత్నబాబు. ఆయన దర్శకత్వంలో ఈ చిత్రం చేయడం ఆనందంగా ఉంది. పుట్టుకతో రెండు బుర్రలు ఉండటం అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మామూలుగా మనసు డిస్టర్బ్ అయితే ఒక బుర్రతో ఆలోచిస్తేనే తలనొప్పి వస్తుంది. అదే రెండు బుర్రలుంటే అతని పరిస్థితి ఏంటి అనేది అసలు కథ. సాయికుమార్తో 1977లో `స్నేహం` అనే ఒక సినిమా చేశాను. అందులో ఆయన హీరో. ఇవాళ బుర్రకథలో వాళ్లబ్బాయి హీరో. ఆది చాలా బాగా నటించాడు. మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. నేను నటించిన `బుర్రకథ`, `కౌసల్యా కృష్ణమూర్తి`, `ఓ బేబీ` మూడూ విడుదలకు ఉన్నాయి. వీటిలో నా పాత్ర, నా నటన ఎక్కడైనా ఒకే రకంగా అనిపిస్తే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతాను`` అని అన్నారు.
శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ `` ఈ నెల 5న విడుదల చేస్తున్నాం. ఆది మా సినిమాలో చాలా అందంగా కనిపిస్తారు. చాలా వైవిద్యమైన కథ ఇది. షో చూసిన వారందరూ ఆది పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీ అని అంటున్నారు`` అని అన్నారు.
కిరణ్ రెడ్డి మాట్లాడుతూ ``పండగ వాతావరణం మా సినిమాకు ఇప్పుడే వచ్చేసింది`` అని చెప్పారు.
మణిచందన మాట్లాడుతూ ``ఇందులో నేను రాజేంద్రప్రసాద్ గారికి పెయిర్గా చేశాను. చాలా మంచి సినిమా ఇది`` అని చెప్పారు.
సాయికార్తిక్ మాట్లాడుతూ ``సినిమా తప్పకుండా మెప్పిస్తుంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది`` అని అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ ``నేను నటించే రోజుల్లో ఏదైనా మంచి పాత్ర వస్తే ఎగ్జయిట్ అయి, ఇంట్లో మా నాన్నకు చెప్పేవాడిని. అలాగే మా అబ్బాయి కూడా ఈ సినిమాలో చాలా సార్లు ఎగ్జయిట్ అయి మా ఇంటికి వచ్చి నాతో షేర్ చేసుకునేవాడు. లవ్లీ, శమంతకమణి తర్వాత ఆది, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ అవుతుంది. జయాపజయాలు అనేవి ఈ ఇండస్ట్రీలో చాలా సర్వసాధారణమైనవి. ఆడలేవు అనుకున్న సినిమాలు ఎన్నో ఆడి చూపించాయి. శంకరాభరణం, పోలీస్ స్టోరీ, సేతు వంటివన్నీ అలాంటివూజ అలా ఆడినవే. ఈ సినిమాలో రామ్ప్రసాద్ మా ఆదిని చాలా అందంగా చూపించాడు. రామ్ప్రసాద్ తొలి సినిమా పచ్చతోరణంలో నేను నటించాను`` అని చెప్పారు.
ఆది మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వచ్చింది. ఈ విషయాన్ని కూడా ఎన్నో సార్లు చెప్పాను. రెండు రోజుల్లో గోవాలో భాను చాలా మంచి డ్యాన్సులు చేయించాడు. రాజేంద్రప్రసాద్గారితో సినిమా అనగానే కేరక్టర్ విన్నాక నాకు వారం రోజులు సరిగా నిద్రపట్టలేదు. అంత ఎగ్జయిట్ అయి చేసిన సినిమా ఇది`` అని చెప్పారు.
డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ ``ఒక ఫోన్లో రెండు సిమ్ములు, ఒక హెడ్లో రెండు బ్రెయిన్లు ఉండటం అనే కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంది. వింటేజ్ క్రియేషన్స్ వారు ముందుకు రావడం ఆనందంగా ఉంది. సెన్సార్సభ్యులు సినిమా చూసి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. జూలౌ 5న విడుదల చేస్తున్నాం. ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ సాంబశివరావు కుటుంబానికి నా తరఫున రూ.20వేలు ప్రకటిస్తున్నా`` అని అన్నారు.