ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ కామన్. ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతుల్లోకి వస్తుంటుంది. అయితే సీక్వెల్స్ విషయంలో మాత్రం రిస్క్ తీసుకోడానికి ఇష్టపడరు దర్శకులు. ముందు ఎవరితో చేస్తారో.. ఆ తర్వాత కూడా వాళ్లతోనే సినిమా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇక్కడ ఓ దర్శకుడు ముందు నయనతారతో చేసిన సినిమాను ఇప్పుడు ఆమెను కాదని మరో హీరోయిన్ వైపు వెళ్తున్నాడు. అతడే గోపీ నైనర్.. రెండేళ్ల కింద ఈయన తెరకెక్కించిన అరమ్ సినిమా సంచలన విజయం సాధించింది. కర్తవ్యం పేరుతో తెలుగులో కూడా వచ్చింది ఈ చిత్రం. ఇక్కడ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేయాలనుకుంటున్నాడు దర్శకుడు గోపీ. ఈ విషయాన్ని అప్పుడే అనౌన్స్ చేసాడు కూడా.
తొలి భాగంలో కలెక్టర్ పదవికి రాజీనామా చేయడంతో సినిమా అయిపోతుంది. అక్కడ్నుంచి నయనతార రాజకీయాల వైపు వస్తుంది. అక్కడ ఆమె ఎలా రాణించింది అనేది కథ. అయితే ఇప్పుడు ఈ సినిమాను నయన్ తో కాకుండా సమంతతో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. దానికి ప్రత్యేకంగా కారణాలేమైనా ఉన్నాయా.. లేదంటే ఈ మధ్య నయన్ చేస్తున్న సినిమాలు ఫ్లాప్ కావడమే అసలు కారణమా అనేది మాత్రం తెలియడం లేదు.
బోరుబావిలో పడ్డ చిన్నారిని కాపాడటానికి ఓ కలెక్టర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఎలా గెలిచింది అనేది ఈ చిత్ర కథ. దీన్ని మరింత హృద్యంగా తెరకెక్కించాడు గోపీ. ఇక ఇప్పుడు సీక్వెల్ లో నయన్ స్థానంలో సమంత నటిస్తే ఆమెలా మెప్పించగలదా అనేది కూడా ఆసక్తికరమే. మరి చూడాలిక.. అరమ్ సీక్వెల్ సమంతకు ఎలా ఉపయోగపడనుందో..?