ఒకప్పటికి కంటే ఇప్పుడు సినిమా పట్ల హీరోల బాధ్యత బాగా పెరిగింది. చిత్రీకరణలో పాల్గొనడమే కాదు సినిమా ప్రమోషన్లలో కూడా చెమటోడ్చాల్సి వస్తోంది. అలాగే వాళ్ళు డెడికేషన్ తో ప్రమోషన్స్ ను చేస్తున్నారు. మెయిన్ గా డిజిటల్, ప్రింట్ మీడియా ప్రమోషన్లే కాకుండా నేరుగా జనం మధ్యకు వెళ్లి ప్రమోషన్స్ చేయడం తప్పనిసరైంది. అందుకే విజయ్ దేవరకొండ సందీప్ కిషన్ లాంటి హీరోలు వినూత్నమైన ప్రమోషన్స్ చేస్తున్నారు. ముందుగా సందీప్ కిషన్ విషయానికి వస్తే.. ఆయన నటించి, నిర్మించిన కొత్త చిత్రం 'నిను వీడని నీడను నేను' కొద్దిరోజుల క్రితమే విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు మెల్లగా పుంజుకుని స్టడీగా రన్ అయ్యాయి. అయితే ఆ సమయంలో సందీప్ కిషన్ రంగంలోకి దిగి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. మొదట థియేటర్స్ కవరేజ్ చేసి.. ఆ తర్వాత గుంటూరు, విజయవాడలోని కళాశాలలకు వెళ్లి విద్యార్థుల్ని కలిశారు.
దీనితో ఆగకుండా వైజాగ్ బీచ్ రోడ్ మీద సైకిల్ తొక్కుతూ ప్రతి అభిమాని దగ్గరికి వెళ్లి పలకరించి మరి సెల్ఫీ ఇచ్చారు. పైగా కాకినాడ లక్ష్మీ థియేటర్లలో స్వయంగా టికెట్ కౌంటర్లో కూర్చొని టికెట్స్ విక్రయించాడు. మొత్తానికి సందీప్ కిషన్ ప్రమోషన్లంటేనే కొత్త అర్థం చెప్పేశారు. అదేవిధంగా.. హీరో రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం మేకర్స్ కూడా వినూత్నంగా తెలివైన ప్రమోషన్లు చేయడంతో అది సినిమాకి బాగా హెల్ప్ అయింది. మొదటి రోజు నుండి, ఇస్మార్ట్ శంకర్ టీమ్ ప్రమోషన్లను చాలా బాగా చేశారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సినిమాకి వస్తోన్న ఆదరణను కూడా అప్ డేట్ చేస్తూ... సినిమాని చూడని ప్రేక్షకుల్లో కూడా సినిమా పై క్యూరియాసిటీని పెంచేలా చేశారు.
అలాగే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా వచ్చిన 'డియర్ కామ్రేడ్' కూడా వినూత్నమైన ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కొత్తరకం కాన్సెప్ట్ లు తెచ్చి మరి ప్రమోషన్స్ ను బాగా చేసాడు. మొత్తానికి మన హీరోలు ప్రమోషన్లంటేనే కొత్త అర్థం చెప్పేశారు.