సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలి అంటే అదృష్టం ఉండాలి.. విజయం సాధించాలంటే దమ్మున్న కంటెంట్ తో సినిమా తీయాలి. ఒకవేళ సినిమా తీసి హిట్ కొట్టిన తరువాత కూడా కొన్ని కష్టాలు వస్తుంటాయి. ఎందుకంటే.. సినిమా ఇండస్ట్రీలో ద్వితీయ గండం ఉంటుంది. ఈ గండాన్ని విజయవంతంగా దాటిన వాళ్ళు ఇండస్ట్రీలో అద్భుతంగా రాణిస్తుంటారు. మొదటిసినిమాతో సూపర్ హిట్ కొట్టి.. రెండో సినిమాతో బోల్తా కొట్టిన చాలా మంది దర్శకులు ఇండస్ట్రీలో ఉన్నారు. అందుకే రెండో సినిమా అనే సరికి భయపడుతుంటారు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు అజయ్ భూపతి. రెండో సినిమా కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. టాప్ హీరోలతో సినిమా ఛాన్స్ వచ్చినా ఏదీ వర్కౌట్ కాలేదు. చాలా ట్రై చేశాడు. నిర్మాతలు రెడీగా ఉంటె హీరోలు కాదన్నారు. హీరోలు ఒకే అంటే నిర్మాతలు ముందుకు రాలేదు. ఆర్ ఎక్స్ 100 హిట్ కొట్టినా ఖాళీగా ఉండిపోయాడు అజయ్ భూపతి.
ఆలస్యం అయినా మంచి ప్రొడక్షన్స్ తో ముందుకు రాబోతున్నాడు ఇప్పుడు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన విష్ణు ఇందూరి ఇప్పుడు హాలీవుడ్ నిర్మాత సంస్థ సోని పిక్చర్స్ తో కలిసి ఇండియాలో సినిమాలు నిర్మించేందుకు సిద్ధం అయ్యారు. ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు హిందీలో కపిల్ దేవ్ బయోపిక్ 83, అలానే తమిళంలో జయలలిత బయోపిక్ తలైవి సినిమాలు నిర్మిస్తున్నారు.
ఈ నిర్మాత హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసిన తరువాత తెలుగులో మొదటగా అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతున్నది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడంలో కూడా సినిమాలు చేయబోతున్నారు. ఇప్పటికే డిస్నీ సంస్థ ఇండియాలో సినిమాలు నిర్మిస్తోంది. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ బాలీవుడ్ లో సినిమాలు తీస్తున్నది. అలానే మార్వెల్ సంస్థ కూడా ఇండియాలో సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నది. హాలీవుడ్ కు ఆసియాలో చైనా తరువాత పెద్ద మార్కెట్ ఇండియా కావడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు హాలీవుడ్ ముందుకు రావడం విశేషం.