మహేష్ బాబు కెరీర్లో ఒక్కడు సినిమా మెగా హిట్ అని చెప్పొచ్చు. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ తరువాత చాలా కాలం వరకు అలానే ఉండిపోయింది. అందులో మహేష్ అందించిన నటన సూపర్ అనాలి. ఎందుకంటే మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో భూమిక హీరోయిన్. కర్నూలు నేపథ్యంలో సాగే సినిమా ఇది. ముఖ్యంగా కొండారెడ్డి బురుజు వద్ద తీసిన షాట్స్ అద్భుతం అని చెప్పాలి.
అయితే, చాలా కాలం తరువాత మహేష్ బాబు మరలా కర్నూలు బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ చేయడం చాలా కష్టమైన పని. అందుకే దాదాపు 4 కోట్ల రూపాయల ఖర్చుతో రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేశారు. ఆ సెట్ లో ప్రస్తుతం షూట్ చేస్తున్నారు.
పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నా.. ఇందులో మాస్ కు కావాల్సిన అన్ని రకాల మసాలా హంగులు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నారు. రష్మిక మందన్న హీరోయిన్. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాపై భారీ నమ్మకాలు ఉన్నాయి. ఆర్మీ మేజర్ గా ఉన్న మహేష్ బాబు ఎందుకు సడెన్ గా హైదరాబాద్ వస్తాడు.. ఆ తరువాత ఎందుకు కర్నూలు వెళ్ళాడు అన్నది కథ.
అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎంటర్టైన్ వే లో నిర్మిస్తూనే.. మహేష్ అభిమానులకు కావాల్సిన అన్ని రకాల హంగులను ఇందులో మిళితం చేస్తున్నారట. సినిమాకు సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లీక్ చేస్తూ.. హైప్ క్రియేట్ చేస్తున్నారు. మాములుగా మహేష్ సినిమాల వివరాలు పెద్దగా బయటకు రావు. ఎప్పుడో రేర్ గా బయటకు వస్తుంటాయి. కానీ, అనిల్ మాత్రం అందుకు విరుద్ధంగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ క్యూరియాసిటీని కలిగిస్తున్నాడు.