తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా ఉండేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. కారణం ఏంటో తెలుసా.. బోర్డు మెంబర్లుగా ఉంటటం వలన స్వామీ వారిని నిత్యం దర్శనం చేసుకోవచ్చు. పాలక మండలి బోర్డు మెంబెర్ అంటే అదొక గౌరవం కూడా. పైగా అవి నామినేటెడ్ పదవులు కాబట్టి ప్రభుత్వం వారిని నియమిస్తుంది. ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండే వాళ్లకు ఆ పదవులను కట్టబెడుతుంది ప్రభుత్వం.
కాగా, 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం కూలిపోయి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారం మారడంతో.. నామినేటెడ్ పదవులు అలంకరించిన వ్యక్తులు కూడా మారిపోతారు. టిటిడి చైర్మన్ పదవి కూడా మారిపోయింది. ఆ పదవి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డిని ఎంపిక చేసింది ప్రభుత్వం. పాలక మండలి సభ్యులను ఇంకా నియమించలేదు. ప్రస్తుతం బోర్డు సభ్యులుగా కొంతమంది పాతవాళ్ళు కొనసాగుతున్నారు.
అయితే, పాలక మండలి సభ్యులుగా తెలంగాణ నుంచి ముగ్గురిని నియమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఒకరు మైహోమ్ అధినేత రాజేశ్వర రావు. ఈయన కెసిఆర్ కు బాగా కావాల్సిన మనిషి. కెసిఆర్ రికమండేషన్ చేయడంతో జగన్ ఒకే చెప్పారట. అంతేకాదు.. రాజేశ్వర రావుకు చిన్న జీయర్ స్వామీ మద్దతు కూడా ఉన్నది. ఇంకేం జగన్ అసలు కాదనడు.
వీరితో పాటు సినిమా రంగం నుంచి దిల్ రాజు ను పాలక మండలి సభ్యుడిగా నియమించాలని అనుకుంటున్నారు. దిల్ రాజుకు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి ఉన్నది. అందుకే అయన ప్రొడక్షన్ కు ఆ పేరు పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ కు ముందు తప్పని సరిగా అయన తిరుపతి వెళ్తుంటారు. అయన భక్తికి మెచ్చి కెసిఆర్ రికమండేషన్ తో దిల్ రాజును కూడా సభ్యుడిగా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనే విషయం తెలియాలి. ఎందుకంటే, ప్రస్తుతం జగన్ పాలన పనుల్లో బిజీగా ఉన్నారు. నామినేటెడ్ పదవులకు సంబంధించిన విషయాలను నింపాదిగా చూస్తున్నారు. మరి బోర్డు సభ్యుల నియామకం ఎప్పుడు చేపడతారో చూడాలి.