రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్న విషయం తెలిసిందే. దాదాపుగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమాను రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ తెరకెక్కించగా, ప్రభాస్ స్నేహితులు వంశీ మరియు ప్రమోద్, తమ యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా దీనిని నిర్మించడం జరిగింది. బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవడ్ నటుడు అరుణ్ విజయ్, బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మురళి శర్మ, వెన్నెల కిశోర్, మందిర బేడీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇక ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, తప్పకుండా పెద్ద విజయాన్ని అందుకుని మన టాలీవుడ్ సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాలని కోరుకుంటూ, ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా సాహోకు ముందస్తు అభినందనలు తెలియచేస్తున్నారు. ఇకపోతే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నేడు సాహో పై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన వంశీ, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో నిర్మించిన 'వి ఎపిక్' అనే సినిమా థియేటర్ లాంచ్ సందర్భంగా సూళ్లూరిపేట విచ్చేసారు చరణ్. ఆసియాలోనే అతిపెద్ద థియేటర్ గా రూపొందిన ఈ థియేటర్ ను ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించినందుకు వంశి అన్నకు తన ధన్యవాదాలు అని, 

ఈ థియేటర్లో కాసేపటి క్రితం తాను చూసిన సాహో, సైరా సినిమాల ట్రైలర్ల ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మరువలేనని అన్నారు. ఇక వంశి, ప్రమోద్ ల యువి సంస్థ నుండి రేపు రిలీజ్ కాబోతున్న సాహో తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాలని, తనకు ఎంతో ఇష్టమైన హీరో ప్రభాస్ గారికి, సినిమాటోగ్రాఫర్ మది గారికి, అలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన జీబ్రాన్ గారికి తన తరపున అభినందనలు తెలుపుతున్నట్లు చరణ్ తెలిపారు. ఇక చరణ్ రాకతో సూళ్లూరిపేట ప్రాంతమంతా జనసందోహంగా మారింది. అతి త్వరలోనే మరొక్కసారి ఇక్కడకు వచ్చి, తమ సైరా సినిమాను ఈ థియేటర్లోనే తప్పకుండా వీక్షిస్తానని చరణ్ అన్నారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: