దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. రాజమౌళి తన సినిమాల్లో విజువల్స్ ని తప్ప.. డైలాగ్ లను పెద్దగా నమ్ముకొరు. కానీ ఈ చిత్రంలో రాజమౌళి డైలాగ్ లకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. సాయిమాధవ్ చేత ఇప్పటికే మూడు వెర్షన్స్ రాపించారట. అయినా కొన్ని సన్నివేశాల్లో రాజమౌళి ఇంకా డైలాగ్స్ విషయంలో సంతృప్తి పడలేదని తెలుస్తోంది. అందుకే తనకు మాటల సాయం అందించే దేవ కట్టాతో కూడా ఆ సన్నివేశాల వరకూ రాపిస్తున్నాడట. దేవ కట్టా 'బాహుబలి 2'లో కూడా కీలక సన్నివేశాలకు డైలాగ్స్ రాసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'కి కూడా కీలక సీన్స్ వరికి రాయబోతున్నాడు అన్నమాట.
ఇక యూరోపియన్ దేశంలోని బల్గేరియాలో రాజమౌళి ఇప్పటికే బాహుబలి 2 యాక్షన్ సీక్వెన్స్ స్ ను షూట్ చేశాడు. కాగా తాజాగా ఇప్పుడు, రాజమౌలి క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ లోని కొన్ని సీన్స్ ను కూడా బల్గేరియాలో షూట్ చేయనున్నారు. రాజమౌలి తన చిత్రబృందంతో 3 వారాల పాటు సాగే సుదీర్ఘ షెడ్యూల్ కోసం బల్గేరియాలో షూట్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా 'బాహుబలి' తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.