టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన 48వ జన్మదినంలోకి అడుగుపెట్టారు. మొదటినుండి తన పుట్టినరోజులు జరుపుకోవడం తనకు అంతగా ఇష్టం ఉండదు అని చెప్పే పవన్, ఈ ఏడాది కూడా వేడుకలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే మరోవైపు పవన్ ఫ్యాన్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవ కార్యక్రమాలతో పేదసాదలకు అన్నదానం, పలు రక్తదాన శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 

ఇక పలువురు సినిమా ప్రముఖులు, నేటి ఉదయం నుండి వెల్లువలా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పవన్ కు బర్త్ డే విషెస్ తెల్పుతూ ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నేడు పవన్ జన్మదినం సందర్భంగా కలవడం జరిగింది. నిర్మాత సూర్యదేవర నాగవంశీతో కలిసి పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఇంటికి వెళ్లిన త్రివిక్రమ్, అక్కడే దాదాపుగా మూడు గంటలకు పైగా గడిపినట్లు సమాచారం. అంతేకాక, అతి త్వరలో తాను పవన్ తో తెరకెక్కించబోయే సినిమా కథను ఆయనకు వినిపించారని, ఆ కథను విన్న పవన్, మధ్యలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని రమ్మన్నారని అంటున్నారు. 

నిజానికి ఇకపై తన జీవితాన్ని ప్రజా క్షేత్రంలో గడపాలని పవన్  భావించినప్పటికీ, తన ఫ్యాన్స్ సహా అన్నయ్య మెగాస్టార్ కోరిక మేరకు, మరొక రెండు సినిమాల్లో పవన్ నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక త్రివిక్రమ్ తో చేయబోయే ఈ సినిమాను హరికహాసిని క్రియేషన్స్  బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ, అలానే దాని తరువాత చేయబోయే మరొక సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తారని చెప్తున్నారు. అయితే పవన్, త్రివిక్రమ్ ల కథా చర్చల విషయమై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన రావడం జరుగలేదు. కాబట్టి వారిద్దరి నుండి ఈ సినిమా విషయమై ప్రకటన వస్తేనే కానీ, ఇందులో నిజానిజాలు తేల్చలేం అంటున్నారు సినీ విశ్లేషకులు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: