ఏడాది విరామం అనంతరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల.. వైకుంఠపురములో.. అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను అత్యంత పోటీ నడుమ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జెమిని టివి సొంతం చేసుకుంది. ఈవిషయాన్ని జెమిని టివి అధికారికంగా ప్రకటించింది. అయితే ఎంత మొత్తానికి ఈ హక్కులను సొంతం చేసుకొందో మాత్రం వెల్లడించలేదు.
తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. కాగా బన్నీ తో పూజా హెగ్డే కు ఇది రెండో సినిమా. వీరితోపాటుగా ఈ చిత్రంలో టబు ,మురళి శర్మ , మలయాళీ నటుడు జయరాం , సుశాంత్ , నవదీప్ , నివేత పేతురాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక త్రివిక్రమ్ -అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయాలు సాధించడం తో ఈ అల.. వైకుంఠపురములో.. ఫై భారీ అంచనాలు వున్నాయి. మరి ఆ అంచనాలు అందుకొని వీరిద్దరూ హ్యాట్రిక్ ను సాధిస్తారో లేదో చూడాలి. జనవరి లో ఈచిత్రం విడుదలకానుంది. ఇక ఈసినిమా తరువాత అల్లు అర్జున్.. సుకుమార్ తో అలాగే ఎమ్ సి ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ తో సినిమాలు చేయనున్నాడు .