మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై దాదాపుగా రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. రత్నవేలు కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి వీక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ ని సంపాదించడం జరిగింది. 

అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ తో అదరగొట్టిన సైరా టీజర్, సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. ఇక అతి త్వరలో ప్రి రిలీజ్ వేడుకను జరుపుకోనున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, అనుష్క, తమన్నా, నిహారిక కొణిదెల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీ రేంజ్ లోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే నేడు నిర్మాత రామ్ చరణ్, తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ, 

'నాన్న గారు సైరా సినిమాలో నరసింహారెడ్డి గారి పాత్ర కోసం ఎంతలా తనను తాను మలుచుకున్నారో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. నిర్మాతగా మారిన తరువాత ఆయన వంటి నిజమైన మెగాస్టార్ ని తొలిసారి కలిసినట్లుగా అనిపిస్తోంది' అంటూ చరణ్ ఒక పోస్ట్ చేసారు. అంతేకాక ఆ పోస్ట్ తో పాటు, నరసింహారెడ్డి గారి లుక్ లో ఉన్న తండ్రి మేకప్ ని సరిచేస్తున్న స్టిల్ ని చరణ్ పోస్ట్ చేయడం జరిగింది. కాగా చరణ్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మరి ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలున్న ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంతవరకు ఆ అంచనాలు అందుకుంటుందో తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే..!!


మరింత సమాచారం తెలుసుకోండి: