‘మనం’ సక్సస్ తరువాత చాలామంది దర్శకుల ఆలోచనలు స్టార్ హీరోల కుటుంబ చిత్రాల కథల పై పడింది. ఇలాంటి పరిస్థితులలో నందమూరి హీరోల మల్టీ స్టారర్ ఘట్టమనేని హీరోల మల్టీ స్టారర్ వార్తలు గతకొంతకాలంగా ఇండస్ట్రీలో హడావిడి చేస్తూనే ఉన్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో దర్శకుడు హరీష్ శంకర్ నోటివెంట ఇప్పుడు మెగా మల్టీ స్టారర్ మాటలు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈవారం విడుదల కాబోతున్న ‘వాల్మీకి’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ తన ఆలోచనలను బయటపెట్టాడు. 

చిరంజీవి పవన్ చరణ్ లను దృష్టిలో పెట్టుకుని ఒక కథను తాను వ్రాశానని ఆ కథను వినడానికి చిరంజీవి అంగీకరిస్తే తాను చెప్పడానికి సిద్దం అన్న సంకేతాలు ఇచ్చాడు. అంతేకాదు ఇప్పటికే తాను పవన్ సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లతో సినిమాలు తీసిన నేపధ్యంలో తన మెగా మల్టీ స్టారర్ సెట్స్ పైకి రాగలిగితే మెగా హీరోలు అందరితోను సినిమాలు తీసిన ఏకైక డైరెక్టర్ గా తాను రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉంది అంటూ తన కలలు బయటపెట్టాడు. 

వాస్తవానికి ఎప్పటి నుంచో చిరంజీవి పవన్ కళ్యాణ్ లు కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని మెగా అభిమానులు కలలు కంటున్నారు. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ చెప్పిన మాటలు నిజం అయితే ఇక మెగా అభిమానులకు పండగే. ప్రస్తుతం చిరంజీవి పవన్ ల మధ్య మంచి అనుబంధం కొనసాగుతున్న పరిస్థితులలో రానున్న రోజులలో ఎవరైనా భారీ నిర్మాత హరీష్ శంకర్ కలను నిజం చేయడానికి ప్రయత్నం చేస్తే అది ఇండస్ట్రీ సంచలనం అవ్వడమే కాకుండా రికార్డుల విషయంలో మరో కొత్త చరిత్రను సృష్టించే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: