-చిరంజీవి కార్యాలయం ముందు ఉయ్యాలవాడ కుటుంబీకుల ఆందోళన
- 'ఉయ్యాలవాడ' కుటుంబీకులకు చిరంజీవి అన్యాయం చేశాడంటూ ఆరోపణ
‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు విడుదలకు ముందే వివాదాలు చుట్టుముట్టాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఐదో తరం వారసులకు చిరంజీవి మోసం చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే నిన్న జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం. 10,ఎమ్మెల్యే కాలనీలో ఉన్న కొనిదల ప్రొడక్షన్స్ కార్యాలయం ముందు ఉయ్యాలవాడ వారసులు బైఠాయించిన విషయం తెలిసిందే. అయితే అన్యాయం జరిగిందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వచ్చి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు
ఉయ్యాలవాడ వంశీయులు ఏమంటున్నారంటే..
'సైరా' సినిమా తీసే సమయంలో సినిమాకు అవసరమైన కథ కోసం తమ నుంచి సమాచారం మొత్తం సేకరించారని షూటింగ్కు అవసరమైన లొకేషన్స్ అన్నీ తెలుకున్నారని వారు చెప్పారు. తమకు న్యాయం చేస్తామని ఆ సమయంలో చిరంజీవి హామీ ఇచ్చారు కానీ, ఇంతవరకు న్యాయం చేయలేదని వారు ఆరోపించారు.
గత మేలో స్వామినాయుడు.. రాంచరణ్ పీఏ అవినాష్ తదితరులు తమను పిలిపించి రూ.5 కోట్లకు అగ్రిమెంట్ చేయించారని.. నోటరి కూడా చేశారని చెప్పారు. ఉయ్యాలవాడ వంశీకులైన 22 మందికి ఈ మొత్తాన్ని ఇస్తామని మాట ఇచ్చారని వివరించారు. ఇప్పటి వరకూ వారు మాట నిలబెట్టుకోలేదని, తమకు న్యాయం చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఊరుకోమని స్పష్టం చేస్తున్నారు.
గత నెలలో ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ఏడు కుటుంబాలకు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా న్యాయం చేయకపోవటంతో తాము రాంచరణ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తమకు ఎలాంటి హక్కులు లేవంటూ రాంచరణ్ పీఏ అవినాష్ చెబుతున్నారని.. తమను మోసం చేసినట్లుగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చేసిన నోటరీని ఎలా మర్చిపోతారని వారు ప్రశ్నిస్తున్నారు.
రామ్చరణ్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు అన్ని పనులు పూర్తి చేసుకుంటోంది. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, అనుష్క, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధం అవుతోంది. మరీ ఈ విదాదం ఎటు వైపు వెళ్తుందో వేచి చూడాలి.