హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నటుడు, బిగ్బాస్ వ్యాఖ్యాత నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ అంటే ఏదో అనుకోకండి.... ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్లలో, మెట్రోలో ప్రయాణించే ముందు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రయాణికులకు అవగాహన పెంచేందుకు ఇలా మెట్రో సంస్థతో చేతులు కలిపి బిగ్బాస్ రియాలిటీ షో ఆధ్వర్యంలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు నాగార్జున. మెట్రో రైళ్లలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. ఈ క్రమంలో మెట్రో రైలు ప్రయాణం, పలు జాగ్రత్తలు తీసుకునే విధంగా వారికి అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించే ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రంలో భాగంగానే ఇందు కోసం స్టార్ మా ఛానెల్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ చేతులు కలిపి ముందుకొచ్చాయి. బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ను దీనికి ఒక ఆయుధంగా ఎంచుకొంది. బిగ్బాస్ ఈజ్ వాటింగ్ యు’ (బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు) అనే స్లోగన్తో ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా నగరంలోని 48 మెట్రో స్టేషన్లలో కాన్కోర్స్, ప్లాట్ఫాం లెవెల్, రిటైల్ స్పేస్ల వద్ద ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన జింగిల్స్తో పాటు అదే తరహా సందేశాలను సైతం అన్ని మెట్రో రైళ్లలోనూ ప్రచారం చేయనున్నారు. ఈ క్యాంపెయిన్ను ఈ ‘బిగ్బాస్’ సీజన్ మొత్తం ప్రచారం చేయనున్నారు.
ప్రయాణికులకు అవగాహన కోసమే....
ఈ క్యాంపెయిన్ ద్వారా మెట్రో ప్రయాణికులు రైళ్లు, స్టేషన్ ప్రాంగాణాలలో చేయాల్సిన, చేయకూడని తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. వాస్తవానికి ఇది వాణిజ్య ఒప్పందమే అయినప్పటికీ ప్రజలకు ఎంతో దగ్గరై ‘బిగ్బాస్’ రియాలిటీ షో ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తే ప్రయాణికులకు త్వరగా చేరుతుందని ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ భావిస్తోంది. అందుకే, హీరో నాగార్జునను కూడా రంగంలోకి దింపింది. ‘బిగ్బాస్’కు హోస్ట్గా ఉన్న నాగార్జున.. ఈ ప్రచారంలో కూడా పాల్గొననున్నారు. అయితే ఈ అవగాహన ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవంలో స్టార్ మా నెట్వర్క్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఎల్టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డితో పాటు నాగార్జున పాల్గొన్నారు.