నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా, నిజానికి తొలిరోజు తొలిఆట మొదలుకుని ప్రేక్షకుల నుండి మంచి టాక్ ని సంపాదించింది. నాని ఈ సినిమాలో పెన్సిల్ పార్ధసారధి అనే రైటర్ గా నటించి మెప్పించగా, ఆయన సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. రివెంజ్ డ్రామా స్టోరీని ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్, సినిమాలోని కథలోనే మంచి ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేసి తెరకెక్కించడంతో మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంశలు కురిపించడం జరిగింది. అయితే ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ, 

తొలి మూడు రోజుల వరకు మాంచి జోరుగా సాగిన గ్యాంగ్ లీడర్, ఆ తరువాత మెల్లగా చతికలపడుతూ, ప్రస్తుతం అత్యల్ప కలెక్షన్లతో ముందుకు సాగుతున్నాడు. నిజానికి ఈ సినిమాకు తొలిరోజు మంచి హిట్ టాక్ రావడంతో, తరువాతి రోజు సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ని జరిపింది. అయితే ఆ తరువాత నుండి యూనిట్ సభ్యులు సినిమాను ప్రమోట్ చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని అంటున్నారు. ముఖ్యంగా హీరో నాని అయితే, ఆ తరువాతి రోజే తన తదుపరి సినిమా వి షూటింగ్ లో పాల్గొనడానికి థాయిలాండ్ వెళ్లడం జరిగింది. అయితే అది ముందే సెట్ చేసిన షెడ్యూల్ కావడంతో నాని, గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ కు అందుబాటులో లేకుండా పోయారు. 

అయితే అదే అంశం మెల్లగా కలెక్షన్స్ పై ప్రభావం చూపుతూ ప్రస్తుతం పూర్తిగా దారుణమైన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కొనసాగడానికి కారణం అయిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. నిజానికి మంచి కంటెంట్, ఎంటర్టైన్మెంట్ ఉన్న గ్యాంగ్ లీడర్ సినిమాపై మిగతా యూనిట్ సభ్యులైనా మరింత గట్టిగా దృష్టిపెట్టి పలు విధాలుగా ప్రమోషన్ చేసినట్లయితే బాగుండేదని, అలా చేయకపోవడం వల్లనే అది కొంతవరకు సినిమా రిజల్ట్ తేడా కొట్టేలా చేసిందని అంటున్నారు. అయితే ఎంతో మంచి టాక్ సంపాదించిన గ్యాంగ్ లీడర్ సినిమా, కేవలం అతి కొద్దిరోజుల్లోనే ఈ విధంగా పేలవంగా ముందుకు సాగడానికి పూర్తి కారణం మాత్రం చాలామంది ప్రేక్షకులకు అర్ధం కావడం లేదనే చెప్పాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: