టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్, కాసేపటి క్రితం సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్, నిన్న ఆరోగ్యం మరింత విషమించడంతో ఆసుపత్రిలో చేరారు, డాక్టర్లు ఆయనకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. నేటి మధ్యాహ్నం ఆయన పరిష్టితి పూర్తిగా విషమించి మరణించడం జరిగిందని డాక్టర్లు తెలిపారు. మొదట మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేసిన వేణు మాధవ్, ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా, ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 

అయితే తొలి సినిమాలో ఆకట్టుకునే నటనను ప్రదర్శించిన వేణుమాధవ్, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఆ తరువాత పలు సినిమాల్లో కమెడియన్ గా ఆయనకు అవకాశాలు వచ్చినప్పటికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమాలో ఆయన చేసిన పాత్రకు అప్పటి యూత్ లో మంచి పేరు రావడం జరిగింది. ఆ సినిమాలోని ఆర్నాల్డ్ అనే క్యారెక్టర్ లో అమ్మాయిల గురించి ఆయన చెప్పే డైలాగ్ అప్పట్లో మంచి ఫేమస్ అయింది. ఇక ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో, వేణు మాధవ్ కు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఇక అక్కడినుండి తన కామెడీ టాలెంట్ తో టాలీవుడ్ లో దూసుకెళ్లిన వేణుమాధవ్, మంచి కమెడియన్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించారు. 

ఇక ఇటీవల కొన్నేళ్ల క్రితం భూకైలాస్ అనే సినిమాలో ఆయన హీరోగా నటించడం జరిగింది. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అలానే అలీతో కలిసి ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన హంగామా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక కొన్నాళ్ల నుండి నటనకు దూరంగా ఉన్న వేణుమాధవ్, రెండేళ్ల క్రితం నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. అంతటి గొప్ప కమెడియన్ నేడు అకాల మరణం పొందడంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. ఆయన మరణ వార్త తెలిసి ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకొని వేణుమాధవ్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: