వాళ్లిద్దరు అగ్రహీరోలు.. వారి ఫాన్స్ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని గొడవలు పడే రోజులు.. అలాంటి రోజుల్లో వారిలో ఒక హీరో సినిమా కోసం మరో హీరో ప్రచారం చేశాడంటే నమ్మడం కష్టమే. ఇప్పటి రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కథానాయకుడి సినిమా ప్రీరిలీజ్‌, ఆడియో విడుదల కార్యక్రమాలకు మరొక కథానాయకుడు వస్తున్నారు.


తోటి నటీనటుల చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ ఈ ట్రెండ్ చిరంజీవి, బాలకృష్ణ అగ్రహీరోలుగా ఉన్న రోజుల్లోనూ ఉందట. ఇందుకు అచ్చమైన ఉదాహరణ ఆదిత్య 369 సినిమా అని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకున్న బాలకృష్ణ తన సినీ కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించారు. అలాంటి చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి.


విచిత్రం ఏంటంటే.. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొని సందడి చేశారు.‘ఆదిత్య 369’ రిలీజ్ అయిన తర్వాత మరింత ప్రచారం కల్పించడానికి, పిల్లలను, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షించడానికి నిర్మాత దూరదర్శన్‌లో యాడ్స్ వేయాలని ప్లాన్ చేశారట. ఆ యాడ్స్ లో చిరంజీవితో ప్రచారం చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించారట .


ఆదిత్య 369 చిత్ర నిర్మాత చిరంజీవిని అడగ్గానే ఆయన ఒప్పుకున్నారట. అలా చిరంజీవి మరో టాప్ హీరో సినిమా అయిన ‘ఆదిత్య 369’ సినిమా యాడ్స్‌లో నటించారు. ఈ యాడ్స్ దూరదర్శన్‌లో ప్రసారం అయి బాగా పాపులర్ అయ్యాయి. ఆదిత్య సినిమా ప్రజలకు చేరువయ్యేందుకు దోహదపడ్డాయి. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి తోడ్పడ్డాయి. ఆదిత్య 369 విజయానికి బాలకృష్ణ నటన, ఇళయరాజా సంగీతం, సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ తో పాటు చిరంజీవి ప్రచారం కూడా కలసివచ్చిందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: