శ్రీ విష్ణు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాలే చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా మొదలు ఆయన చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో ఆయన చేసిన పాత్రకు చాలా మంచి పేరొచ్చింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు నటనకి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత శ్రీ విష్ణుకి మంచి అవకాశాలు వచ్చాయి.


అయితే శ్రీ విష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ చిత్రాలు మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా బాగా ఆర్జించాయి. అయితే ప్రస్తుతం శ్రీ విష్ణు తిప్పరా మీసం అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే మరో సినిమాని ప్రకటించేశాడు. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.


నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో ఈ  చిత్రాన్ని నిర్మించటానికి నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సన్నాహాలు చేస్తున్నారు. శ్రీవిష్ణు హీరోగా ఇటీవల విడుదల అయి ఘన విజయం సాధించిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ కనబరచిన ‘హాసిత్ గోలి’ ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, శ్రీవిష్ణు,హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: