సైరా నరసింహారెడ్డిలో నయనతార మెయిన్ హీరోయిన్. తమన్నాది చిన్న పాత్ర ఏమో అని అనుకున్నారు అందరూ. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక.. నయనతార కంటే కూడా తమన్నాకే ఎక్కువ పేరు వచ్చింది. ఆ మాటకొస్తే మెగాస్టార్ తరువాత తమన్నా పాత్రే అభిమానులను బాగా ఆకట్టుకుంది. అందుకే తమన్నా తెగ సంబర పడిపోతుంది. ఈ రోజు జరిగిన సైరా సక్సెస్ వేదిక పై తమన్నా మాట్లాడుతూ.. 'నా కెరీర్ లోనే బెస్ట్ రోల్ అయిన లక్ష్మీ పాత్రను నాకు ఇచ్చినందుకు సూరి సర్ కి థాంక్స్. ఒక్కో ఫ్రేమ్ లో ఒక్కో సినిమాని చూసుకున్నా. ఇన్నాళ్లు నన్ను అవంతిక.. నీహారిక అని పిలిచేవాళ్ళు. కానీ ఇప్పటినుండి నన్ను లక్ష్మీ నరసింహారెడ్డి అని పిలుస్తున్నారు. ఈ పిలుపు నా కెరీర్ లోనే బెస్ట్ కాంప్లిమెంట్ అని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది మిల్క్ బ్యూటీ.
కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు. అలాగే ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటించారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. సినిమా రిపోర్ట్స్ ను బట్టి బ్లాక్ బస్టర్ అంటున్నారు.
కాగా ఈ రోజు సినీ ప్రముఖుల కోసం సైరా ప్రత్యేక షోను వేశారు. నాగార్జున, అల్లు అర్జున్, అఖిల్ మరియు కొంతమంది సినీ ప్రముఖులు ఈ ప్రత్యేక షోకి వచ్చారు. సినిమా చూసిన వాళ్ళంతా సినిమా చాల బాగుందని మెగాస్టార్ కి అభినందనలు తెలిపారు. అయితే బీజీ షెడ్యూల్ కారణంగా 'సైరా' ప్రీ రిలీజ్ వేడుకకు హాజరుకాలేకపోయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ షోకి వచ్చారు. సినిమా విడుదలకు ముందు సినిమా గురించి గొప్పగా మాట్లాడిన ఆయన, ఏఎంబి సినిమాస్ లో చిరు ఏర్పాటు చేసిన స్పెషల్ షోకు భార్యా పిల్లలతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.