మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. విడుదలైన అన్ని చోట్ల విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ మూవీ విజయంలో నటీనటులు, సాంకేతిక విభాగం, దర్శకత్వం, మ్యూజిక్ ఇలా ప్రతి ఒక్క విభాగం పాత్ర చాలానే ఉంది. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ను ఆయన సున్నితంగా డీల్ చేసిన విధానం మూవీ చూసిన అందరిలో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. అలాగే సైరా సినిమాను అనౌన్స్ చేసినప్పుడు సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను ఎలా తెరకెక్కిస్తాడో అని అనుమానాలు వ్యక్తం చేసిన అందరూ.. ఆ తరువాత ఆయనపై అభినందనల వర్షం కురిపించారు. టాలీవుడ్ టాప్ డైరక్టర్లు, హీరోలు సైతం సురేందర్ రెడ్డి పనితీరుకు ముగ్ధులయ్యారు. కాగా ఈ సక్సెస్‌తో ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారాడు సురేందర్ రెడ్డి.


 ఈయన గతంలో అల్లు అర్జున్‌తో రేసు గుర్రం, రామ్ చరణ్‌తో ధృవ చిత్రాలను తెరకెక్కించాడు. రేసు గుర్రం సమయంలో ఆయన పనితీరును మెచ్చిన అల్లు అరవింద్.. చెర్రీతో తాను నిర్మించిన ధృవకు ఛాన్స్ ఇచ్చారు. ఇక ధృవ సినిమాను మెచ్చిన చిరు.. మరో ఆలోచన లేకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరాను సురేందర్ రెడ్డి చేతిలో పెట్టాడు.


తాజాగా ఈ చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని నితిన్ తో చేయనున్నట్టుగా ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆయన కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: