'సాయి ధరమ్ తేజ్' ఇండస్ట్రీలోకి 'పిల్లా.. నువ్వులేని జీవితం' అనే హిట్ మూవీతోనే ఎంట్రీ ఇచ్చినా.. 'చిత్రలహరి'కి ముందు దాకా ఆరు ప్లాప్ లతో కొట్టుమిట్టాడాడు. ఎప్పుడో 2015లో వచ్చిన ‘సుప్రీమ్’ తర్వాత చేసిన 'తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు' ఇలా తేజు నటించిన సినిమాలన్నీ భారీ డిజాస్టర్ లే. ఈ డిజాస్టర్ ల దెబ్బకి తేజు మార్కెట్ అతి దారుణంగా పడిపోయింది. అందుకే 'నేను శైలజ' ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన 'చిత్రలహరి'కి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. మొత్తానికి హిట్ వచ్చినా.. మెగా మేనల్లుడు డీలా పడాల్సిన పరిస్ధితి. దాంతో ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ - మారుతి సినిమా "ప్రతి రోజు పండగే" ఫై కూడా ప్లాప్ ల ప్రభావం పడింది. ముందుగా ఈ చిత్రానికి 20కోట్ల బడ్జెట్ అనుకున్నారు. ఆ తరువాత తేజు మార్కెట్ చూసి 12 కోట్ల వరకే కేటాయించారు.
కాగా ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరువుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమా నుండి చిత్రబృందం ప్రీ లుక్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. చేతిలో చేయి వేసి ఉన్న ఈ ప్రీ లుక్ లో ఓ పల్లెటూరి నేపథ్యాన్ని కూడా బాగా ఎలివేట్ చేసారు. ఇక క్రిష్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ "సుప్రీం" సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఏమైనా ఈ సినిమా ఫలితం బట్టే బాక్సాఫీస్ వద్ద 'సాయి ధరమ్ తేజ్' రేంజ్ కూడా ఆధారపడి ఉంటుంది.