యంగ్ హీరోలందరూ కలిసి డబ్బులు కూడా పెట్టి ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే సినిమా చేశారు. నేనూ అటువంటి మనస్తత్వం ఉన్న హీరోనే, ఇప్పటికీ చెబుతుంటా నాకు కథ నచ్చితే రెమ్యునరేషన్ ఇవ్వొద్దు అని నటుడు రాజశేఖర్ అన్నారు. కొత్త దర్శకులు, నిర్మాతలకు డబ్బులొస్తేనే ఇవ్వమని చెబుతా, డబ్బులు వస్తేనే తీసుకోవాలి అనుకునే మనస్తత్వం నాది. అందరూ ఇదే పద్ధతి పాటిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది అని హీరో రాజశేఖర్ అన్నారు.
ఆది సాయికుమార్ హీరోగా, రచయిత అబ్బూరి
రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్ డేగ లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ నెల 18న విడుదల కానుంది. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ 1990 లలో కశ్మీర్లో పండిట్లకు ఏం జరిగిందో అందరికీ తెలియాలని చేసిన ప్రయత్నం ఈ సినిమా అని అన్నారు.
ఆది ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం సాయికుమార్ గారు ఆయనకు థ్యాంక్స్ అని అన్నారు. కశ్మీర్ పండిట్ల ఎమోషన్ను క్యాష్ చేసుకోవడానికి ఈ చిత్రం తీయలేదు. మాకు తెలిసిన విషయాలను పదిమందికి చెబుదామని తీశాం అని అన్నారు అబ్బూరి రవి. నాకు ఈ సక్సెస్ చాలా ఇంపార్టెంట్ అని అన్నారు సాయికుమార్. ఆది మా అబ్బాయిలాంటివాడు అని అన్నారు జీవితా రాజశేఖర్. ఈ కార్యక్రమానికి నేను ఆది కుటుంబ సభ్యుడిగా వచ్చాను అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు.
ప్రతి ఇండియన్ గర్వపడే చిత్రమిది అన్నారు నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి. నిర్మాతలు కేశవ్, ప్రతిభ, హీరో అడివి శేషు, నటులు కృష్ణుడు, మనోజ్ నందం, పార్వతీశం, కార్తీక్ రాజు, అనీష్ కురువిళ్ల, సంగీత దర్శకుడు
శ్రీ చరణ్ పాకాల, నిర్మాత రాజ్ కందుకూరి ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా మెన్ గా జైపాల్రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కిరణ్రెడ్డి తుమ్మ, సహ నిర్మాతగా దామోదర్ యాదవ్ (వైజాగ్) వ్యవహరించారు.