తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ 'తలైవి' అనే టైటిల్ తో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా నవంబర్ 12వ తేదీ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం తమిళం కూడా నేర్చుకుంటున్న ఈ బాలీవుడ్ క్వీన్.. బరువు కూడా పెరుగనుంది. ఈ సినిమా కోసం దాదాపు పది కిలోలు వరకూ కంగనా బరువు పెరగుతుందట. అయితే ఫస్ట్ షెడ్యూల్ తరువాతే ఆమె బరువు పెరగనుంది. ఫస్ట్ షెడ్యూల్ లో జయలలిత యుక్త వయసులో ఉన్నప్పటి సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇక ఈ బయోపిక్ లోనే మరో కీలకమైన పాత్ర అయిన ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఇక మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ దళపతి మూవీలో సీఎం కరుణానిధి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
కాగా హాలీవుడ్ మూవీ 'డార్కెస్ట్ హవర్'కి మేకప్ మెన్ గా పనిచేసిన 'గ్యారీ ఓల్డ్ మెన్, 'అమ్మ' బయోపిక్ కూడా చెయ్యనున్నారు. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా చూపించనున్నారు. దాంతో కంగనా 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించనుంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. కాగా ఈ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లు అని తెలుస్తోంది. ఎలాగూ కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లు పెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది.