మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో  హెల్త్ టిప్స్ వీడియోస్ చేస్తూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల గురించి పెద్దగా స్పందించని ఆమె.. ప్రస్తుతం దేశ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. శనివారం తన నివాసంలో భారత వినోదరంగానికి చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు. మోదీతో వారు దిగిన సెల్ఫీలు కూడా సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. దక్షిణాది నటులెవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇదే ఉపాసన ట్వీట్ లో ఆవేదనకు కారణమైంది.

 

 

‘ప్రధాని మోదీ బాలీవుడ్ సినీ ప్రముఖులను గౌరవించడం ఆనందంగా ఉంది. కానీ ఆ గౌరవాన్ని బాలీవుడ్ కే పరిమితం చేయడం బాధాకరం. మిమ్మల్ని ఎంతో అభిమానించే వాళ్లలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వారూ ఉన్నారు. వారందరినీ మీరు మరిచారు. దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని చిన్నచూపు చూడడం బాధించింది. భవిష్యత్‌లో ఇలా జరగకుండా చూడాలని కోరుతున్నా’ అంటూ ఆవేదనతో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా ప్రకటించింది. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా మోదీ ఈనెల 19న ఢిల్లీలో సినీ, టీవీ రంగాలు రూపొందించిన నాలుగు సాంస్కృతిక వీడియోలను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్.. తో సహా పలువురు సెలబ్రిటీలు మాత్రమే పాల్గొన్నారు.

 

 

దక్షిణాది నటులు కమల్ హాసన్, పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్.. ఇలా చాలామంది ఉత్తరాది పెత్తనమనీ, దక్షిణఆదిని తక్కువ చేసి చూస్తున్నారనీ పలుమార్లు స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహాత్ముడి ఆలోచనలకు సంబంధించిన కార్యక్రమంలో కేవలం బాలీవుడ్ ప్రముఖులే ఉండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఈ కార్యక్రమం నిర్వాహణపై దక్షిణాది నుంచి మరింతగా వ్యతిరేకత రావడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: