ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా 'రొమాంటిక్'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రమ్యకృష్ణ, ఆకాష్ పూరి తల్లి పాత్రలో నటిస్తోందని ఇటీవలే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న కేతిక శర్మకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోందట. అంటే సినిమాలో ఆకాష్ పూరికి రమ్యకృష్ణ అత్తగా కనిపించబోతుంది అన్నమాట. గతంలో రమ్యకృష్ణ ఎన్టీఆర్ కి అత్తగా కనిపించింది. అలాగే ఇటివలే నాగచైతన్యకి కూడా రమ్యకృష్ణ అత్తగా కనిపించి అలరించింది. ఇప్పుడు ఆకాష్ పూరి వంతు వచ్చింది. ఇక డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ.. మెహబూబా చిత్రం తీశారు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, పూరి మాత్రం తన కుమారుడిని హీరోగా బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ ని హీరోగా పెట్టి ఈ 'రొమాంటిక్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
కాగా ఈ సినిమా నుండి రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ ఆయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ కేతిక టాప్ లెస్ గా హీరోని కౌగిలించుకోవడం.. ఘాడమైన ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయిన ప్రేమ జంటగా వీరిద్దరూ కనిపించడంతో పోస్టర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను పెంచింది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. ఈ రొమాంటిక్ మూవీలో బాలీవుడ్ నటి మందిరా బేడీ ఓ కీలక పాత్రలో నటిస్తుందట. అలాగే మరో హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోపక్క పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. చాలా సినిమాల తర్వాత హిట్ కొట్టడంతో పూరి - ఛార్మి మంచి జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో తమ సినిమా ఉంటుందని పూరి - ఛార్మి కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత పూరి బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు.